అలాంటి వారు అధికారంలో ఉంటే.. రాష్ట్ర భవిష్యత్ ప్రమాదంలో : వైఎస్ షర్మిల
ముఖ్యమంత్రి జగన్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షర్మిల మాట్లాడారు. అలాంటి వారు అధికారంలో ఉంటే రాష్ట్ర భవిష్యత్ ప్రమాదంలో పడుతుందన్నారు. సొంత బాబాయినే హత్య చేసిన వారిని జగన్ తన పక్కనే పెట్టుకుంటున్నారని, పిలిచి మరీ టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. ఎక్కడ చూసినా మాఫియా మయమే అయ్యిందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు.
వైసీపీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. చక్కెర నుంచి పెట్రోల్ వరకు ఎలా సామన్య ప్రజలపై మోయలేని భారం పడుతోంది. జగన్ బటన్ నొక్కి ఇచ్చేది రూ.10 అయితే, తిరిగి రూ.100 వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. పేద కుటుంబానికి ఏడాదికి రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తాం. రూ. 5 లక్షలతో ఇల్లు కట్టించి ఇస్తాం. వృద్ధుల పింఛను రూ.4 వేలు, వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచుతాం. యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా, రాష్ట్రానికి రాజధాని నిర్మించాలన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ మళ్లీ బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని అన్నారు.