ఎస్వీయూలోని ప్రాచ్య పరిశోధనా సంస్థను సందర్శించిన ఎన్ఆర్ఐలు
అమెరికాలోని అట్లాంట, జార్జియా రాష్ట్రాల్లోని ప్రతిష్టాత్మక కంపెనీలు నిర్వహిస్తోన్న ఎన్ఆర్ఐలు ఎస్వీయూలోని ప్రాచ్య పరిశోధనా సంస్థను సందర్శించారు. వీసీ శ్రీకాంత్ రెడ్డి అనుమతితో ఎన్ఆర్ఐలు సంస్థలో భద్రపరచిన ప్రాచీన రాతపత్రులను తిలకించారు. తాళపత్ర, కాగిత ప్రతుల్లో నిక్షిప్తమైన జ్ఞాన సంపదను, లిపి, అందమైన అక్షరాలను తీర్చిదిద్దడంలో పూర్వీకులు కనబరిచిన నైపుణ్యాన్ని వారికి సంస్థ సంచాలకులు ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు వివరించారు. మన ప్రాచీన జ్ఞానాన్ని సంరక్షిస్తున్న సంస్థ అభివృద్ధికి, సవీకరణకు తమ వంతు సహకారం అందిస్తామని ఎన్ఆర్ఐలు హామీ ఇచ్చారు. సంస్థలను సందర్శించిన వారిలో సెరినిటీ ఇన్ఫోటెక్ అధినేత శ్రీనురెడ్డి, విజన్ ఇన్ఫోటెక్ ప్రతినిధి ఉపేంద్ర, సీ విజన్ టెక్ అధినేత రాజశేఖర్ రెడ్డితో పాటు డాక్టర్ సుందర రాజారెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.