‘రైతు భరోసా నిధుల విడుదలను ఆపండి’.. సీఎం రేవంత్కు షాకిచ్చిన ఈసీ
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సర్కారుకు ఎలక్షన్ కమిషన్ షాకిచ్చింది. రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్కు ముందు నిధులు విడుదల చేయొద్దని, ఏదైనా ఎన్నికల తర్వాతే చూసుకోవాలని ఆదేశించింది. రైతు భరోసా సొమ్ము విడుదలకు వ్యతిరేకంగా ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. రైతు భరోసా చెల్లింపులను ఎన్నికల కోసం వినియోగించుకునేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయంటూ ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్.. సీఎం రేవంత్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. వెంటనే రైతు భరోసా నిధుల విడుదలను నిలిపేయాలని ఆదేశించింది.
కాగా.. 5 ఎకరాల కంటే ఎక్కువ సాగు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు ఇప్పటికే నిధులు విడుదలవగా.. తాజాగా ఐదెకరాలుపైగా భూమి ఉన్న వారికి చెల్లింపులు మొదలుపెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఇటీవల ఎన్నికల బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి మే 9వ తేదీలోగా రైతులందరికీ రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో 13వ తేదీకి ముందు నిధులు విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అంటే సీఎం ఇచ్చిన హామీ కూడా పూర్తయ్యేలా కనిపించడం లేదు.