ఏపీలో నామినేషన్లు వేసిన టీడీపీ ముఖ్యనేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలతో కోలాహలం నెలకొంది. నేడు నామినేషన్ల వేసిన వారిలో టీడీపీకి చెందిన ముఖ్య నేతలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, విజయవాడలో తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్, పాయకరావుపేటలో వంగలపూడి అనిత, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, ఉండిలో రఘురామకృష్ణరాజు, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్, తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు, సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీ నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీ అభ్యర్థుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ( నెల్లూరు), పెమ్మసాని చంద్రశేఖర్ ( గుంటూరు), మతుకుమిల్లి శ్రీభరత్ ( విశాఖపట్నం) నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.