ఒంటిమిట్టలో ఘనంగా సీతారాముల కల్యాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితులు మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్ వలనన్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. టీడీపీ తరపున కార్య నిర్వహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి రూ.31 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అందజేశారు. టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ పర్యవేక్షణలో పరిణయ ఘట్టం నయనానందకరంగా సాగింది. ప్రధాన వేదికను ఫల, పుష్ప, పత్రాలతో మనోహరంగా తీర్చిదిద్దారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ముత్యాల తలంబ్రాలు, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు రామయ్య క్షేత్రం నుంచి కల్యాణవేదిక వరకు కనులపండువగా శోభాయాత్ర సాగింది.