ఓటర్లకోసం ర్యాపిడో ‘ఫ్రీ రైడ్’
పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్తో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కూడా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రైడ్ షేరింగ్ యాప్ ర్యాపిడో.. ఎక్స్ వేదికగా బంపరాఫర్ ప్రకటించింది. ఓటర్లను ఉచితంగా పోలింగ్ బూత్ల వరకు చేర్చుతామని తెలిపింది. ఈ నెల 13న తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ర్యాపిడో.. ‘‘హెలో తెలంగాణ.. మార్పునకు సమయం ఆసన్నమైంది. దేశం పట్ల మన బాధ్యతను ఓటు ద్వారా నిర్వర్తిద్దాం. అలాగే ఓటు వేయడానికి ర్యాపిడో ఫ్రీ రైడ్ వినియోగించుకోవడం మాత్రం మర్చిపోకండి. వోట్ నౌ (VOTE NOW) కోడ్ ద్వారా మీ ఫ్రీ రైడ్ను పొందండి.’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. కాగా.. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకోసం 10 లక్షల మంది కెప్టెన్లను అందజేస్తున్నామని ర్యాపిడో తెలిపింది. వికలాంగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మార్గంలో రవాణా సదుపాయం లేకపోతే తమ సేవలను వినియోగించుకోవచ్చని సూచించింది.