‘ఓటుకు నోటు కేసు’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రేవంత్కు సంబంధించిన ఓటుకు నోటు కేసును తొక్కిపట్టిందని, ఇప్పుడు దానికి ప్రతిఫలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెడుతోందని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గంలో జహీరాబాద్, మెదక్ బీజేపీ అభ్యర్థులు బిబి పాటిల్, రఘునందన్ రావుకు మద్దతుగా నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు
కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటేనని, రెండు పార్టీలూ ఒకే గూటి పక్షులని అన్న మోదీ.. అవినీతి రాకెట్లో ఈ రెండూ పార్టీలు భాగస్వాములేనంటూ ధ్వజమెత్తారు. ‘‘మొన్నటి వరకు తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోంది. బీఆర్ఎస్ పాలనలో ఓటుకు నోటు కేసును తొక్కిపెట్టి రేవంత్ను కాపాడింది. ఇప్పుడు కాళేశ్వరం అవినీతి ఫైల్స్ను దాచిపెట్టి, కేసీఆర్ను కాంగ్రెస్ కాపాడుతోంది’’ అని మోదీ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వీళ్లంతా భాగస్వాములేనని గుర్తు చేశారు.