ఇప్పుడు ఫోటోలు.. రేపు పథకాలు.. బాబుతో పెట్టుకుంటే అన్ని మాయం.. పేర్ని నాని
తాజాగా టీడీపీ విడుదల చేసిన కూటమి మ్యానిఫెస్టో లో ప్రధానమంత్రి మోదీ ఫోటో లేకపోవడంపై పేర్ని నాని చంద్రబాబుకు కౌంటర్ వేశారు. మచిలీపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రెస్ తో సమావేశమైన నాని చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు సంధించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి అందుతున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక మాయ మాటలు చెప్పిన మోసం చేయడానికి కూటమినేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో కూటమిగా ఏర్పడిన సమయంలో చంద్రబాబు బీజేపీ తో కలవడం వెనుక ఐదు కోట్ల ప్రజల శ్రేయస్సు.. ఆంధ్ర అభివృద్ధి ఉంది అని చెప్పడం నాని గుర్తు చేశారు. మొన్నటి వరకు ముగ్గురు ఫోటోలతో ప్రచారం చేసిన చంద్రబాబు మేనిఫెస్టోలో మాత్రం మోడీ ఫోటోను ఎందుకు ఎత్తేసారని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు ఫోటోలతో పాటు చంద్రబాబు చెబుతున్న పథకాలు కూడా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఒక్కొక్కటి మాయం అవుతుందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందే ఇలాగ ఉంటే గెలిచాక బాబు ఇంకెలా మారిపోతాడో గుర్తించండి అని ఓటర్లను హెచ్చరించారు. చెప్పిన మాట చేయడానికి కట్టుబడి ఉండే జగన్ లాంటి వ్యక్తిని నమ్మడం ఆంధ్ర శ్రేయస్సుకు మంచిదని పిలుపునిచ్చారు.