ప్రధాని మోదీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ స్పీచ్..
రాజమండ్రి వేమగిరిలో నిర్వహిస్తున్న కూటమి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ మోదీ నీ ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మోదీని వేనోళ్ల కీర్తించారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, శక్తిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు. భారతదేశానికి కేవలం అభివృద్ధి మాత్రమే కాదు గుండె ధైర్యం కూడా కావాలి.. శత్రుదేశాల మీద పోరాటగలిగే శక్తి కూడా ఉండాలి. ఆర్టికల్ 370 రద్దు చేసిన బలమైన శక్తి మోదీ కంటే మనకు మరొక శక్తి ఏముంది అని పవన్ అన్నారు. ఈరోజు ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూడాలన్న భయపడుతున్నారని.. ఇందుకు కారణం మన ప్రధానమంత్రి అని ఎంతో గర్వంగా చెప్పారు. సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు, పర్వతం ఎవడికీ వంగి సలాం చేయదు..ఈ శేషేంద్ర కవిత చదివినప్పుడు తనకు మోదీ గుర్తుకు వస్తారని పవన్ చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు, సాగునీరు, త్రాగు నీరు.. ఇలా మోదీ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు అని పేర్కొన్నారు. అయితే కేంద్రంలో అంత మంచి పాలన ఉంటే.. ఆంధ్రాలో మాత్రం ఇసుక మాఫియా, మట్టి మాఫియా.. స్కాములతో అతలాకుతలమవుతుందని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కోసం కూటమితి అంగీకరించిన మోదీకి వేదిక మీద నుంచి పవన్ నమస్సుమాంజలలు అర్పించారు.