గత ఐదేళ్ల అభివృద్ధిపై విస్తృతంగా ప్రచారం చేయాలి..అమెరికాలో
ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల లో జరిగిన అభివృద్ధిని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అమెరికాలోని వైఎస్ఆర్సీపీ అభిమానులు నిర్ణయించారు. అమెరికాలోని లాస్ఏంజెల్స్ నగరం సమీపంలో గల ఇర్విన్ పట్టణంలో వారు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ఈ వారం రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. వాస్తవానికి గత అన్ని ప్రభుత్వాలకంటే ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఆదాయ వనరులతో భావితరాల అభివృద్ధికి బాటలు పరిచినప్పటికీ కేవలం సంక్షేమానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఎక్కువ ప్రచారం పొందాయని చర్చించారు. అందువల్ల అభివృద్ధికి సంబంధించి ప్రచారం చేసి మరింత అవగాహన కల్పించాలని తీర్మానించారు. పలువురు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ తాను చేసిన పనులను చెప్పి ఓట్లను అభ్యర్థిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం వారు గతంలో చేసిందేమీ లేక కేవలం తిట్లు, పరుషవాక్యాలతో ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రజలు ఈ వ్యత్యాసం గ్రహించలేనివారు కాదని పేర్కొన్నారు. ఆ విషయం ఎన్నికల ఫలితాలతో నిరూపణ అవుతుందని తెలిపారు.