మరొకసారి కూటమి ప్రచారంలో పాల్గొననున్న ప్రధానమంత్రి..
ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచార జోరు పెంచాయి. ఏపీలో కూటమిగా ఏర్పడిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు తమ వంతు సోలో ప్రచారంతోపాటు అప్పుడప్పుడు కలిసి ప్రచారాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరొకసారి రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి తరఫున బహిరంగ సభలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోతున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేట ప్రాంతాలలో నిర్వహించే సభలలో మోదీ పాల్గొనే అవకాశం ఉంది. ఈ సభలలో ప్రధానమంత్రి తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. ప్రధాని రాష్ట్రానికి విచ్చేసేలోపే వీలైనన్ని ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించాలని చంద్రబాబు, పవన్ కలిసి నిర్ణయించారు.
ఈనెల 24వ తారీఖున రాయలసీమలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరొక ఉమ్మడి ప్రచారం జరగనుంది. ఇక ఎన్నికలకు కేవలం కొన్ని వారాల వ్యవధి మాత్రమే ఉండడంతో ప్రచారాన్ని ముమ్మరంగా చేయడానికి కూటమి నిర్ణయించుకుంది. మోదీ పాల్గొనే సభలకు సంబంధించిన షెడ్యూల్ ఒకటి రెండు రోజులలో ఖరారు అవుతుంది.