భర్త కోసం రంగంలోకి దిగిన నందమూరి ఆడపడుచు..
ఆంధ్రాలో అసలు రాజకీయం మొదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ఫుల్ బిజీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక వీరికి చేదోడు వాదోడుగా కుటుంబ సభ్యులు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఒకపక్క చంద్రబాబు నాయుడు కోసం భువనేశ్వరి రంగంలోకి దిగితే ఇటు తన భర్త లోకేష్ కోసం నారా బ్రాహ్మణి రంగంలోకి దిగారు. ఎన్నికల్లో మంగళగిరిలో ఎలాగైనా గెలిచి తన సత్తా చాటుకోవాలి అని లోకేష్ బలంగా ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి ప్రచారం విస్తృతంగా సాగిస్తున్నారు. ఇక భర్తకు తోడుగా బ్రాహ్మణి కూడా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఆమె సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. తాడేపల్లి శ్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలతో ఈరోజు నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు.. ఈ నేపథ్యంగా మాట్లాడిన బ్రాహ్మణి ..లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం 29 సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని.. మంగళగిరి ప్రజల అభివృద్ధి ఆయన లక్ష్యం అని పేర్కొన్నారు. అలాగే స్త్రీ శక్తి పథకంలో లబ్ధిదారులతో మాట్లాడిన బ్రాహ్మణి వారికి సంక్షేమం కావాలి అంటే లోకేష్ గెలవాలి అని చెప్పారు. వీటికి సంబంధించిన అన్ని విషయాలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు.