తగ్గేదే లేదంటున్న ముద్రగడ.. .?
ఇటీవల వైసీపీలో చేరిన కాపు నేత ముద్రగడ పద్మనాభం.. అస్సలు తగ్గేదే లేదంటున్నారు. జనసేనాని మాట వినిపిస్తే చాలు తీవ్రస్వరంతో దండెత్తుతున్నారు. నువ్వు కాపా, నేను కాపా తేల్చుకుందాం రా అని సవాల్ విసురుతున్నారు. తన కుటుంబం చరిత్ర చదివి వినిపించి, నీ కుటుంబం లెక్కలు చెప్పని నిలదీస్తున్నారు. అయితే ముద్రగడ మరీ లోతుల్లోకి పోతుండడం మాత్రం ఆ సామాజికవర్గానికి కాస్త ఇబ్బందికరంగానే మారుతోంది. కూతురిని అడగలేరు కానీ.. పక్కోళ్లకి చెప్పొచ్చారని ఆఫ్ ద టాక్ గా మాట్లాడుకుంటున్నారు కాపు నేతలు.
ఇటీవలే ముద్రగడ కుమార్తె.. తండ్రికి వ్యతిరేకంగా పవన్ కు మద్దతిస్తూ మాట్లాడారు. అయితే తమకు ముద్రగడ అంటే గౌరవం ఉందని, ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే పార్టీలోకి తీసుకుంటామన్నారు పవన్ కల్యాణ్. పవన్ చేసిన వ్యాఖ్యలకు ముద్రగడ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. "ఒక విషయం పవన్ గారూ... మీరు వదిలేసిన ఇద్దరు భార్యలు ఉన్నారు కదండీ. మీరు అనుమతి ఇస్తే ఆ ఇద్దరు మాజీ భార్యలకు, మీ ప్రస్తుత భార్యకు వచ్చే ఎన్నికలప్పుడు సీఎం జగన్ తో మాట్లాడి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తాను. మీకిష్టమైతే చెప్పండి... మీ ఇద్దరు మాజీ భార్యలకు, మీ ప్రస్తుత భార్యకు టికెట్లు ఇప్పించేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు ముద్రగడ.
అంతేకాదు...పవన్ కల్యాణ్ గారూ... మా తాత కాపు, మా నాయనమ్మ కాపు, మా అమ్మ కాపు, నా భార్య కాపు, నా కోడలు కాపు... మేం స్వచ్ఛమైన కాపులం, మేం నికార్సయిన కాపులం. మీరు కూడా స్వచ్ఛమైన కాపు అయితే మీ చరిత్ర బయటపెట్టండి. మీ అమ్మ గారి చరిత్ర, మీ నాన్న గారి చరిత్ర, మీరు పుట్టిన ఊరు, మీ తాతగారి ఊరు, మీ అమ్మ గారి ఊరు... ఇవన్నీ కూడా బయటపెట్టండి. నికార్సయిన కాపు మీరా, నేనా... లోకానికి తెలియాలి. కాపులకు సాయం చేయరా అంటూ ప్రతిసారి మీ కార్యకర్తలతో అనిపిస్తున్నారు. మరి వంగా గీత కాపు కాదా? ఆమె పోటీ చేయకూడదా? అని ప్రశ్నించారు ముద్రగడ.
పవన్ కల్యాణ్ గారూ... ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీరు ఉద్రేకంతో ఊగిపోతూ మాట్లాడుతుంటే చూడలేకపోతున్నాం. సినిమాల్లో నటనను ఇక్కడ చూపిస్తుంటే మేం వెర్రి వెధవల్లా మీకు జై కొట్టాలా? అని నిలదీశారు. అయితే..ముద్రగడ వ్యాఖ్యలతో వైసీపీలోనూ ఎక్కడో భయం కనిపిస్తోంది. ఈమాటలు ఎటు దారితీస్తాయి..వ్యూహం ఫలిస్తుందా..? బెడిసి కొడుతుందా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి.