కవితను అందుకే అరెస్ట్ చేశారు: ఎంపీ లక్ష్మణ్
ఢిల్లీ మద్యం స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నందుకే ఆమెను ఈడీ అరెస్ట్ చేసిందంటూ బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎవ్వరినీ అరెస్ట్ చేయవని, ఇప్పుడు కూడా ఆధారాలున్నందుకే అరెస్టులు చేస్తున్నాయని స్పష్టం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కే లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేయాలంటూ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నాయకులే డిమాండ్ చేశారు. కవితను ఎందుకు అరెస్ట్ చేయరంటూ బీజేపీని నిలదీశారు. తీరా కవిత అరెస్ట్ అయ్యాక ఇప్పుడు కాంగ్రెస్ నేతలే లిక్కర్ స్కాం అంతా బూటకమని అంటున్నారు. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తే.. ఆయన అరెస్ట్ పూర్తిగా అప్రజాస్వామికం అంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సైతం స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇది ఎవరితో ఎవరికి ఉన్న అనుబంధమో ప్రజలు రానున్న ఎన్నికల్లో తేల్చి చెప్తారు’’ అంటూ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.