ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు పుకార్లు పుట్టిస్తున్నాయి..మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఎన్నికల సమీపిస్తున్న ఈ సమయంలో ప్రతిపక్షాలు అధికార పార్టీపై పలు రకాల విమర్శలు చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీని ద్వారా అధికార పార్టీ ప్రజల భూములను అక్రమంగా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రతిపక్షాలు పుకార్లు పుట్టిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి ధర్మాన ప్రసాదరావు క్లారిటీ ఇచ్చారు. ఈ చట్టం తాము తీసుకువచ్చింది కాదు అని తెలియపరచిన ప్రసాదరావు.. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమని గుర్తు చేశారు. అంతేకాదు న్యాయపరమైన క్లియరెన్స్ రాకుండా ఈ చట్టం రాష్ట్రంలో అమలు చేయబోమని.. క్లియరెన్స్ వచ్చాకే రాష్ట్రంలో అమలు చేయడం పై ఆలోచిస్తామని వివరించారు. సోమవారం నాడు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ప్రసాద్ రావు.. విపక్షాలు కావాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ యాక్ట్ మిగిలిన రాష్ట్రాలలో ఎలా అమలు చేస్తారో.. ఆంధ్రాలో కూడా అలాగే అమలు చేస్తామని.. అది కూడా న్యాయబద్ధంగా చేస్తామని వివరించారు. గత 100 సంవత్సరాలలో భూ సర్వే జరగలేదని.. అందుకే తమ ప్రభుత్వం ఇప్పుడు భూ సంస్కరణకు నడుం బిగించిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 వేల రెవెన్యూ గ్రామాలలో 4 రెవెన్యూ గ్రామాలకి సర్వే పనులు పూర్తయ్యాయని వివరించారు. చెప్పిందే చేస్తూ ఎంతో పారదర్శకంగా ఉండే జగన్ ప్రభుత్వం పై విపక్షాలు బురద చల్లుతున్నాయని ఆయన తెలియపరిచారు.