ఆంధ్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషి మనుగడలో.. జీవన శైలిలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఒకప్పుడు బామ్మ మాట బంగారు మూట అనేవారు.. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాట బంగారు మూట అనే పరిస్థితి మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి బాగా వైరల్ అయిన ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రజల ఆలోచన విధానం పై తమ వంతు ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన రాజకీయ నేతలు రాబోయే ఎన్నికల ప్రచారానికి వీళ్లను పూర్తిగా ఉపయోగిస్తున్నారు. అనవసరంగా లేనిపోని వీడియోలు సృష్టించడం.. ఒక నేత గురించి చులకనగా మాట్లాడే విధంగా ప్రేరేపించడం లాంటివి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఇటువంటి వీడియోలను చూసి ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది. అన్ని విషయాల్లో ఆంక్షలు విధించిన ఎన్నికల సంఘం.. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాల గురించి అంతగా పట్టించుకోవడం లేదేమో అనిపిస్తుంది. ఇక్కడ ఏ పార్టీకి తగ్గట్టుగా ఆ పార్టీకి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. కానీ కొందరు మాత్రం అవసరాన్ని మించి, హద్దు దాటి కంటెంట్లు పెడుతున్నారు. కాసేపు నవ్వుకోడానికి, ఎంటర్టైన్మెంట్ పరంగా సృష్టించిన కొన్ని యాప్స్ ని ఇలా చెడుని ప్రచారం చేయడానికి వాడే వారిపై యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రజలు భావిస్తున్నారు. మంచిని పంచడానికి ఉపయోగించాల్సిన సాధనాలను చెడును చూపించడానికి వాడడం సబబు కాదు అని వారు భావిస్తున్నారు.