బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించనున్న కవిత..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటినుంచి బెయిల్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా కవిత ప్రయత్నిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడమే కాక వరుస అరెస్టులు, విచారణలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కవితకు బిగ్ షాక్ తగిలింది. దీంతో అసలు ఆమె బెయిల్ పై ఎప్పుడు బయటికి వస్తారు అనే విషయం సందిగ్ధంగా మారింది. ఈరోజు కవితకు సంబంధించిన బెయిల్ పై తీర్పు వెలువడింది. తనపై ఉన్నటువంటి ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. ఈరోజు ఆమె బెయిల్ ను రోస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి
నిరాకరించారు. ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న కవిత.. పార్టీ కోసం స్టార్ క్యాంపైనర్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది అని కోర్టుకు తెలియజేశారట. మహిళగా తనకు పీ.ఎం.ఎల్.ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హత ఉందని కవిత కోర్టుకు విన్నవించారట. కానీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.