ఎన్నికల ముంగిట.. జగన్ సరికొత్త వ్యూహం..
మరో 11 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.. గట్టిగా ప్రచారానికి పది రోజుల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రజలలో చొచ్చుకపోవడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం, సిద్ధం, మేమంతా సిద్ధం లాంటి పలు కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను తమ వైపు తిప్పుకున్న వైసీపీ.. మరో 11 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయనగా మరొక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘కలలు నిజం చేయడానికి.. జగన్ కోసం సిద్ధం..’ అంటూ ఇప్పటికే దీనికి సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లు రాష్ట్రవ్యాప్తంగా అందరికీ కనిపించేలా ఏర్పాటు చేశారు. రీసెంట్ గా జగన్ 2024 ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోలో తమ ప్రభుత్వం ప్రజలకు అందివ్వాలి అనుకున్న మంచిని ప్రతి ఇంటి గడపకు చేరవేయడమే లక్ష్యంగా జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ను ఆరంభించారు. ప్రజలే తమ పాలిటి స్టార్ క్యాంపైనర్లు అని ఎన్నోసార్లు జగన్ ప్రస్తావించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను తమ ప్రచార పర్వంలో భాగం చేసుకొని.. నిజమైన ప్రజా నేత ఎవరో ఎన్నికల్లో నిరూపించాలి అనేది జగన్ తాపత్రయం.