అక్కడ 14.. ఇక్కడ 5.. పోల్చి చూసుకొని ఓటు వేయండి..జగన్..
గురువారం నాడు అనంతపురం జిల్లా లోని కల్యాణదుర్గం లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్ చంద్రబాబుది ఉసరవెల్లి రాజకీయమని ఎద్దేవా చేశారు. కేవలం మైనార్టీల ఓట్ల కోసం బాబు వారిపై సవతి తల్లి ప్రేమ కురిపిస్తున్నారు అని ధ్వజమెత్తారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీ తో బాబు, పవన్ పొత్తు ఎలా పెట్టుకున్నారు అని జగన్ ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లో ముస్లింలకు ఎప్పటిలాగానే నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులకు నిధులు విడుదల చేయకుండా అడ్డుపడ్డది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలని జగన్ ఆరోపించారు. ఇంకా ప్రజలకు ఇవ్వవలసిన రూ.14,165 కోట్ల చెల్లింపులను ఎన్నికల కమిషన్ అడ్డుకుందని జగన్ అన్నారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి అమలులో ఉన్న సంక్షేమ పథకాల చెల్లింపులకు ఎన్నికల కమిషన్ అనుమతించకపోవడం వెనుక అసలు కారణం ఎన్డీఏ కూటమి అని జగన్ ఆరోపించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే ఎన్నికల్లో కూడా జగన్ కే ఓటు వేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. చంద్రబాబు మేనిఫెస్టో విశ్వసనీయత ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసన్న జగన్.. చంద్రబాబు 14 సంవత్సరాల పాలనను.. తన ఐదేళ్ల పాలనతో పోల్చిన తర్వాతే ఓటు వేయమని అన్నారు.