మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత.. చిన్న విషయానికి ఇంత రచ్చ అవసరమా?
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ.. జనసేన పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు వర్గీయులు జనసేన నేత కర్రి మహేశ్ ఇంటిపై దాడి చేయడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. నిజానికి గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నట్లు చిన్న విషయాన్ని పెద్దది చేసి ఈ ఇద్దరు నేతలు అనవసరంగా గొడవను పెంచుకున్నారు. మచిలీపట్నంలోని ఓ కాలనీలో పేర్ని కిట్టు ప్రచారానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రచారంలో భాగంగా వైసీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. తమ ఇంటి ఎదురుగా కాల్చారు అని కర్రి మహేష్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చిన్న గొడవ కాస్త పెద్దదయింది. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. రోడ్డు మీద బాణా సంచా కాల్చుకుంటే మాకేమి అని కాసేపు గమ్ముగా ఉంటే అసలు గొడవ మొదలయ్యేది కాదు.. వాళ్లేదో అంటే అన్నారు లే మన పాటికి మనం ముందుకు పోతే సరిపోతుంది అని వీళ్ళు అనుకుంటే రచ్చ జరిగేది కాదు. ఇప్పుడు అనవసరంగా ఇద్దరు వ్యక్తులు కొట్టుకొని.. రెండు పార్టీల పేర్లు హైలెట్ చేసి.. ప్రజలలో ఆందోళన సృష్టించారు.