భారత విద్యార్థులకు ఇంద్రానూయి సూచనలు
అమెరికాలో వెలుగుచూస్తున్న భారతీయ విద్యార్థుల మరణాలు, అదృశ్య ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ వాటిపై పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రానూయి స్పందించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన 10 నిమిషాల వీడియోలను న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్టు చేసింది. ఇటీవల కొందరు విద్యార్థులు ఎదుర్కొన్న దురదృష్టకర పరిస్థితుల గురించి తాను విన్నానని, అందుకే ఈ వీడియో రికార్డు చేశానన్నారు. విద్యార్థులు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. స్థాని చట్టాలను గౌరవించాలి. అతిక్రమిస్తే ఎదురయ్యే పరిణామాలు తెలుసుకోవాలి. రాత్రివేళ చీకటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం , మాదకద్రవ్యాలకు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
అమెరికాకు వచ్చిన కొత్తలో స్నేహితుల ఎంపిక, కొత్త అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వీసా నిబంధనలు, తాత్కాలిక ఉద్యోగాలకు అనుమతులు , విదేశీ విద్యార్థులుగా మన పరిమితులు తెలిసి ఉండాలని తెలిపారు. భారతీయ విద్యార్థులు కఠోరశ్రమ, విజయానికి చిరునామాలు. కొందరు ఫెంటానిల్ వంటి డ్రగ్స్కు బానిసలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అవి ప్రాణాంతకం. మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తాయి అని హెచ్చరించారు.