సీఎం రేవంత్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు: ధర్మపురి అర్వింద్
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లను తొలగించేస్తుందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన అర్వింద్.. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చి రిజర్వేషన్లు రద్దు చేయబోతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక.. ఆ అంశం నుంచి ప్రజల దృష్టి మర్చల్చి తన చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడం కోసమే రేవంత్ ఇలా అబద్ధాలు ఆడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా అసలు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేసిందే కాంగ్రెస్ పార్టీ అని అర్వింద్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మోసగాళ్ల పార్టీ అని, ఆ పార్టీ మోసాలను ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని, అందుకే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వాళ్లే బుద్ధి చెబుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం సీఏఏ, ఎన్ఆర్సీ, యూనిఫామ్ సివిల్ కోడ్పై కాంగ్రెస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని అర్వింద్ డిమాండ్ చేశారు.