జూన్ 4 తర్వాత కాంగ్రెస్ కనుమరుగే: ధర్మపురి అర్వింద్
తెలంగాణలో జూన్ 4వ తేదీ తర్వాత కాంగ్రెస్ కనుమరుగు కాబోతోందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని, అందులో ఎలాంటి సందేహం లేదని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాడు జక్రాన్పల్లిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ప్రసంగించిన ధర్మపురి అర్వింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలపై కూడా అర్వింద్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశారని, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి నమ్మిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అలాంటి రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సుస్థిర పాలన కొనసాగాలంటే అది కేవలం నరేంద్ర మోదీతోనే సాధ్యమని పేర్కొన్న అర్వింద్.. భారతదేశంలో ముస్లింలకు ఎలాంటి కష్టం కలగకుండా బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తే.. ఏడాదిలో జక్రాన్పల్లి ఎయిర్పోర్టు పూర్తి చేస్తానని వాగ్దానం చేశారు.