ఓడినా కేసీఆర్లో మార్పు రాలేదు: సీఎం రేవంత్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడినా కేసీఆర్లో మార్పు రాలేదంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్.. మళ్లీ వచ్చి ప్రజలను ఓట్లు అడగటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మంగళవారం హన్మకొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం పడిపోతుందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి, సీఎంగా తాను దిగపోవడానికి తానేం అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదని హెచ్చరించారు. ‘‘ఓటమి తర్వాత కేసీఆర్లో మార్పు వస్తుందనుకున్నాం. రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడుగుతారని భావించాం. కానీ ఆయనలో మార్పు రాలేదు సరికదా.. మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేనేదో అల్లాటప్పాగా సీఎం అవలేదు. ఉద్యమం పేరు చెప్పి పిల్లలను చంపి పదవిలోకి రాలేదు. పార్టీ కోసం కష్టపడి పైకొచ్చాను’’ అని కేసీఆర్కు కౌంటర్ ఇచ్చారు.
అనంతరం కేంద్రంలోని మోదీ సర్కార్పై కూడా రేవంత్ సీరియస్ కామెంట్స్ చేశారు. విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు భారీ పరిశ్రమలు ఇచ్చిందని, కాజీపేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని విభజన చట్టంలో చేర్చిందని చెప్పారు. హైదరాబాద్కు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ను మంజూరు చేసింది యూపీఏ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. విభజన చట్టం ద్వారా తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలు, ప్రాజెక్టులను మోదీ సర్కారు రద్దు చేసిందని, ఆ నిధులను, ప్రాజెక్టులను గుజరాత్కు తరలించిందని ఆరోపించారు.