బీజేపీని గెలిపించాలనేదే కేసీఆర్ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అదే బీఆర్ఎస్ లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ మీడియా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో అసలు ఎలక్షన్ల బరిలో బీఆర్ఎస్ పార్టీ లేనేలేదని, ఆ పార్టీ దాదాపు 6 నుంచి 7 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోబోతోందని జోస్యం చెప్పారు. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని.. బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే చేవెళ్ల, మహబూబ్నగర్, మల్కాజ్గిరి, జహీరాబాద్లలో కనీసం ప్రచారం కూడా చేయట్లేదని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించి మాట్లాడుతూ.. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకమే తమను గెలిపిస్తుందని, ఈ ఎన్నికల్లో 51 శాతం ఓట్లు రావాలనేదే తన టార్గెట్ అని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యేనని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఏనాడూ లేదని, కానీ తమ ప్రభుత్వంలో అందరికీ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించామని అన్నారు.