మోదీ ఇచ్చిన ప్రకటనలో... నిజామాబాద్ పేరెక్కడ ? : సీఎం రేవంత్
సెప్టెంబర్ 17లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్ పేరు లేదన్నారు. నిజామాబాద్లోనే బోర్డు ఏర్పాటు అని స్పష్టంగా చెప్పకుండా నోట్ విడుదల చేశారని విమర్శించారు. ఎన్నికలు అయ్యాక బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదన్నారు.
నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేక అభిమానం. అధికారంలోకి రాగానే చక్కెర పరిశ్రమలు పునరుద్ధరణ గురించి ఆలోచించాం. ఇందుకోసం మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేశాం. కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి రైతులను పట్టించుకోలేదు. పసుపు బోర్డు ఏర్పాటుపై బాండు రాసి ఇచ్చిన బీజేపీ ఎంపీ అర్వింద్ మోసం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ కూటమి తప్పక ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. చక్కెర పరిశ్రమ, పసుపు బోర్డులను జీవన్ రెడ్డి సాధిస్తారు. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. కానీ మోదీ దేవుడిని, భక్తిని ఓట్లుగా మార్చుకుంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడాలంటే మళ్లీ కాంగ్రెస్ గెలవాలి అని అన్నారు.