ఘనంగా చికాగో ఆంధ్ర సంఘం (CAA) అష్టమ వార్షికోత్సవ వేడుకలు
చికాగో ఆంధ్ర సంఘం (CAA) అష్టమ వార్షికోత్సవ వేడుకలు ఏప్రిల్ 27 వ తేదీన, యెల్లో బాక్స్ (Yellow Box) ఆడిటోరియం లో ఘనంగా నిర్వహించారు. సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, మరియు చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి గారి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి 1100 మందికి పైగా చికాగో వాసులు విచ్చేసారు. సంస్థ అభ్యున్నతిని ఎంతో ప్రోత్సహిస్తున్న స్పాన్సర్లు, సంస్థ సభ్యులకు చికాగో ఆంధ్ర సంఘం (CAA) వారు కృతజ్ఞతలు తెలిపారు.
వీనులకింపైన కర్ణాటక సంగీత సాంప్రదాయ గీతాలు, కృతులు, కూచిపూడి, భరతనాట్య నృత్య ప్రదర్శనలు, ఆధునిక చలనచిత్ర గీత నృత్యాలు, నాటికలతో కూడిన ఈ కార్యక్రమానికి మరో ప్రత్యేక ఆకర్షణ Retro theme. తెలుగు సినీ పరిశ్రమలోని మేటి నటులైన చిరంజీవి, బాలకృష్ణ, కమలహాసన్, రజనీకాంత్, రమ్యకృష్ణ, సౌందర్య వంటి ఎంతో మంది అగ్ర తారలను గుర్తు చేస్తూ వినూత్నమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు.
ఈ కార్యక్రమానికి సహాయ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ సంజీవ్ పాల్ గారు ముఖ్య అతిధిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందం కలిగించిందని తెలిపారు.
ఏటేటా ఆనవాయతీగా అందించే "లైఫ్ టైం అచీవ్మెంట్" పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ విద్యావేత్త డా.॥ రత్నం చిట్టూరి గారికి అందించి, వారిని వారి శ్రీమతిని వేదిక పైన శాలువ, పుష్పగుఛ్చాలు, మరియు మెమెంటొతో సన్మానించారు. వీరు కార్పొరేట్ రంగంలో 3 దశాబ్దాలు సేవలందించిన తరవాత, అందరికీ విద్య అందించాలనే ఆశయంతో “నార్త్ సౌత్ ఫౌండేషన్” ను స్థాపించి ఎందరో విద్యార్థుల అభివృద్ధికి దోహద పడ్డారు. వారి సుదీర్ఘ ప్రయాణంలో అందించిన అద్భుతమైన సేవలకు మరియు సాధించిన ఎన్నో నిర్మాణాత్మక విజయాలకు గాను ఆయన్ని ఈ సన్మాన సత్కారాలతో CAA ట్రస్టీలు, అధ్యక్షులు మరియు డైరెక్టర్లు గౌరవించారు.
నరేశ్ చింతమాని ఆధ్వర్యంలో స్థానిక ఇండియన్ రెస్టారెంట్ Bawarchi వారు అందించిన విందు భోజనం - గారెలు, బూరెలు, వడియాలు, ఉగాది పచ్చడి వంటి అసలుసిసలైన ఆంథ్రా భోజనం, సంస్థ వారు కొసరి కొసరి వడ్డించారు. సంస్థ యొక్క ట్రస్టీలు పూర్వ అధ్యక్షులు కార్యక్రమ నిర్వహణకు అన్ని విధాలా తమ సహకారాన్నందించారు. సంస్థ కార్యదర్శి గిరి రావు కొత్తమాసు గారు, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించిన సంస్థ ప్రతినిధులు, కార్యక్రమ పోషకులకు మరియు ఎంతో మంది వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేసి, వందన సమర్పణ చేసారు.
అమెరికా, భారత దేశాల జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం సుసంపన్నమయింది.