ఆ చట్టం అమలైతే మీ భూములు మీవి కావు : చంద్రబాబు
జగన్ రాజకీయాల్లో ఉంటే ప్రజల బతుకులు దిగజారుతాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ బొమ్మ పెట్టారు. ప్రజలకు భూములు జగన్ తాత, నాన్న ఇచ్చారా? ఆస్తి మీదా? జగన్దా? అని ప్రశ్నించారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకువస్తున్నారు. ఆ చట్టం అమలైతే మీ భూములు మీవి కావు. భూములకు సంబంధించి నకలు పత్రాలు మీకు ఇస్తారు. భూమి రికార్డులు మార్చినందువల్ల చేనేత కార్మికుడి కుటుంబం విషం తాగి, ఆత్మహత్య చేసుకుంది. వైసీపీకి ఓటు వేస్తే మీ ఊరికి కూడా గొడ్డలి వస్తుంది. జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి కావాలంటే జగన్ ఉండాలి. గెలుపు మనదే, అభివృద్ధికి పునాదులు వేసుకుందాం. వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు కాలేదు. కూటమి మ్యానిఫెస్టోలో దమ్ముంది. అన్ని వర్గాలవారికి న్యాయం చేశాం. సంపద సృష్టించి, ప్రజలకు పంచడమే మా విధానం. అధికారంలోకి వచ్చిన వారంలో జగన్ సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. పీఆర్సీ ఇస్తామన్నారు.ఈ హామీలన్నీ ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.