వారిని లక్షాధికారిని చేసే బాధ్యత నాది : చంద్రబాబు
ఆడ పిల్లలకు పుట్టినిల్లు తెలుగుదేశం అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలు రాగానే మోసగాళ్లు వస్తారు. రకరకాల మాటలు చెప్తారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి దివంగత నేత ఎన్టీఆర్. కానీ జగన్ మాత్రం ఆయన చెల్లెమ్మకు ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చారు. ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీలు స్థాపించాం. మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పించాం. ఆడ బిడ్డల చదువుకు టీడీపీ ఎంతో కృషి చేసింది. వారిని లక్షాధికారిని చేసే బాధ్యత నాది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టాడు. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నాడు. మీకు రూ.పది ఇచ్చి, రూ.వంద దోచేస్తున్నారు. ఐదేళ్లలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయింది అని విమర్శించారు.