ఎన్నికల టైంలో తెలంగాణ సీఎం రేవంత్కు చంద్రబాబు షాక్!
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి సీఎం రేవంత్ రెడ్డికి టీ-టీడీపీ షాకిచ్చింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ మరోసారి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా చేరిన నేపథ్యంలో బీజేపీకి మద్దతిస్తోంది. ఇక తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలనే ప్రణాళికలతో ముందుకెళ్తున్న బీజేపీ.. మద్దతు విషయంలో టీ-టీడీపీతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం తర్వాతే కాంగ్రెస్కు తమ మద్దతు వెనక్కి తీసుకుంటున్నట్లు టీ-టీడీపీ ప్రకటించింది. తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్తో పాటు ఆ పార్టీకి చెందిన మరికొంతమంది కీలక నేతలతో తెలంగాణ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి బుధవారం నాడు చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం టీడీపీ తెలంగాణలో బీజేపీకి మద్ధతు ఇవ్వాలని నిర్ణయించిందని అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు గౌడ్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ రానున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులంతా ఆ సభలో పాల్గొనాలంటూ చింతల నుంచి టీ-టీడీపీకి ఆహ్వానం కూడా అందింది. కాగా.. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కే టీడీపీ మద్దతివ్వాలని మంత్రి పొంగులేటి వంటి నేతలు నేరుగా టీడీపీ కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరినట్లు వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు బీజేపీకి మద్దతిస్తున్నట్లు టీడీపీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ వ్యవహారంలో మరింత సమాచారం తెలియాల్సి ఉంది.