చంద్రబాబు గెలిస్తే హైదరాబాద్ పరిస్థితి అంతే.. బోయినపల్లి
ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల చర్చలు పక్క రాష్ట్రాల్లో కూడా జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు పై బీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తనదైన స్టైల్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాటున ఆంధ్రాలో చంద్రబాబు గెలిస్తే.. తన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేసేస్తాడు అని సరికొత్త ఆరోపణ చేశారు. అంతేకాదు రేవంత్ రెడ్డి బీజేపీ తో పొత్తు పెట్టుకుని హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేసేస్తాడని విమర్శించారు. బీజేపీ ఆలోచనలు కూడా ఇలాగే ఉన్నాయని.. ఇటువంటి అవకాశం కోసమే ఆ పార్టీ ఎప్పటినుంచో ఎదురు చూస్తోందని వినోద్ పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై గళం విప్పాలి అన్నా.. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి అన్నా…తనను గెలిపించాలి అని కోరారు. పొరపాటున కరీంనగర్ వాసులు మళ్లీ బండి సంజయ్ కు అవకాశం ఇస్తే.. అతను బీజేపీ చేతుల్లో కీలుబొమ్మగా మారుతాడని.. వాళ్లు కూర్చోమంటే కూర్చోవడం.. లెమ్మంటే లేవడం.. తప్ప అతను చేసేది ఏమీ లేదని ఆరోపించారు.