ఇక్కడ మేనేజ్ చేసుకున్నా.. అక్కడికి వెళ్లాక శిక్ష తప్పదు : బ్రదల్ అనిల్
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. డబ్బుతో అసత్యాన్ని సత్యం చేయలేమన్నారు. కొందరు డబ్బు, పదవి కోసం అమ్ముడుపోతారని వ్యాఖ్యానించారు. తప్పును కప్పిపుచ్చుకోవడం కూడా దేవుడి దృష్టిలో తప్పేనని తెలిపారు. ఎవరేం చేసినా వారి మనసుకు, మనిషికి తెలుస్తుంది. ఎవరికీ చెడు, అన్యాయం చేయొద్దు. న్యాయమే చేయాలి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. న్యాయం చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. దానిని సరైన రీతిలో వినియోగించాలి. రాజకీయంలో న్యాయం, అన్యాయం ఉంటుంది. అన్యాయం చేసినవారికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్ చేసుకున్నా, దేవుడి దగ్గరకి వెళ్లాక శిక్ష తప్పదు అని అన్నారు.
మాజీ మంత్రి వివేకా హత్యపైనా బ్రదర్ అనిల్ స్పందించారు. ఆయన్ని హత్య చేయడం చాలా బాధాకరమన్నారు. ఆయన చాలా మంచి నాయకుడని, వైఎస్ఆర్ హైదరాబాద్లో ఉన్న సమయంలో ఇక్కడి వ్యవహారాలన్నీ చక్కదిద్ది, ఆయనకు కుడి భుజంగా వ్యవహరించే వారని తెలిపారు. వివేకా హత్యలాంటి ఘటనలు ఎవరి విషయంలోనూ జరగకూడదన్నారు. ఎప్పటికీ న్యాయానిదే విజయమని, డబ్బు వ్యామోహంతో కక్కుర్తి పడవద్దని రాజకీయ నాయకులకు, ప్రజలను కోరారు. రాజు మంచిగా ఉంటే ప్రజలు మంచిగా ఉంటారన్న ఆయన, చిత్తశుద్ధితో వస్తే అందరికీ మేలే జరుగుతుందన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.