గాడిద గుడ్డుపై ఉన్న శ్రద్ధ గ్యారంటీలపై లేదు: సీఎం రేవంత్పై బండి సంజయ్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డికి గాడిద గుడ్డుపై ఉన్న శ్రద్ధ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల అమలుపై లేదంటూ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ సెటైర్లు వేశారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చిందంటూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రచార సభల్లో బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన గుడ్డును కూడా ప్రదర్శించారు. దీనిపై బీజేపీ కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చింది గాడిద గుడ్డేనని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ కూడా మీడియాతో మాట్లాడుతూ ‘గాడిద గుడ్డు’ కామెంట్స్పై స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. మిగిలేది గాడిద గుడ్డేనని విమర్శించిన ఆయన.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు గాడిద గుడ్డు ఇచ్చింది కాంగ్రెస్సేనని ఎద్దేవా చేశారు. అయితే ఆ ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
అదే విధంగా ప్రధాని మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతలు చేస్తున్న ఆరోపణలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మరోసారి మోదీ, అమిత్షాల గురించి తప్పుడు మాటలు మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఫేక్ వీడియోలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్కు ప్రజలే బుద్ధి చెప్పడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు.