రాక్షసులను రామభక్తులుగా మార్చిన ఘనత బీజేపీదే: బండి సంజయ్
దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు కూడా రామ భక్తులమంటూ చెప్పుకుంటున్నారని, రాక్షసులను కూడా ఇలా మార్చిన ఘనత బీజేపీదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శనివారం నాడు కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో బండి సంజయ్ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుండి బీజేపీలోకి రావాలంటే ఎవరైనా తమ పార్టీకి రాజీనామా చేసి రావాలని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం అవుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీతోనే పోటీ అని స్పష్టం చేశారు.
అంతేకాకుండా కరీంనగర్లో తనను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటి అయ్యాయని ఆరోపించిన బండి సంయ్.. నామినేషన్ల పక్రియ ప్రారంభమైనా కాంగ్రెస్ పార్టీకి ఇంకా అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్ నుంచి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్.. బీఆర్ఎస్ నుంచి 25 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్ లో ఉన్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. వీళ్ల మాటలను చూసి జనం అసహ్యించుకుంటున్నారనే సోయి లేకుండా మాట్లాడుతున్నారు’’ అని బండి సంజయ్ విమర్శించారు.