మా అక్కలు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు.. వైఎస్ అవినాష్ రెడ్డి
కడప ఎంపీ వైసీపీ అభ్యర్థి.. వైఎస్ అవినాష్ రెడ్డి తన అక్కలు షర్మిల, సునీతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కడపలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవినాష్ తన వాహనంపై నుంచి మాట్లాడుతూ.. గతంలో తన గురించి తన అక్కలు చేసిన కామెంట్స్ ను ప్రస్తావించారు. నా అక్కలు నాపై యుద్ధం ప్రకటించారు. నా తప్పులేదు అని ఎన్నోసార్లు చెప్పినా వినకుండా.. తమ్ముడిని అన్న కనికరం కూడా లేకుండా నానా మాటలు అంటున్నారు. ఇంత ఘోరంగా నేను ఇప్పటివరకు ఎవరితో మాటలు పడలేదు. నాకు ఒక రోజు వస్తుంది.. అప్పుడు చేసిన తప్పు తెలుసుకొని నా అక్కలు నాకు క్షమాపణ చెబుతారు అని అవినాష్ అన్నారు. వాళ్లు మాట్లాడుతున్న మాటలు వింటే నాకు ఎంతో బాధ కలుగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గురించి కూడా మాట్లాడిన అవినాష్.. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ లను తన అక్కలు చదువుతున్నారే తప్ప.. వాళ్లకి వాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదు అని బాధపడ్డారు. నిన్న మొన్నటి వరకు తన గురించి పెద్దగా మాట్లాడని తన అక్కలు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంత అసహ్యంగా మాట్లాడడం వెనక చంద్రబాబు ముఖ్య కారణమని ఆయన ఆరోపించారు.