మైనారిటీల పక్షపాతి జగన్ కే మన ఓటు.. అసదుద్దీన్ ఒవైసీ..
ఆంధ్రాలో ముస్లింలు అందరూ ఏకపక్షంగా జగన్ కు మద్దతు ఇవ్వాలి అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. నిజంగా మైనారిటీల కోసం పాటుపడే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్ ప్రభుత్వం మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. కూటమికి ఓటు వేస్తే ముస్లింలు రిజర్వేషన్లు తొలగిస్తారు అని హెచ్చరించారు. ఆంధ్రాలో అసలైన లౌకికవాది అంటే ఒక్క జగన్ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. తమ కోసం ఎంతో చేసిన జగన్ కు మద్దతు తెలిపి.. అందరూ ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరుకున్నారు. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో రిజర్వేషన్లు ఉన్నాయి అంటే దానికి కారణం దివంగత నేత వైయస్సార్ అని చెప్పిన ఒవైసీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లు రాజశేఖర్ రెడ్డి వల్లే వచ్చాయి అన్న విషయాన్ని గుర్తు చేశారు.
అంతేకాదు 2004లో గులాంనబీ అజాద్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడిగా ఉన్న సమయంలో.. కాంగ్రెస్ నేత యూనస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన ఒక సమావేశంలో ముస్లిం రిజర్వేషన్ ప్రసక్తి వచ్చిందని.. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఈ విషయంపై హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రాజశేఖర్ రెడ్డి హామీలను అమలు చేశారని అసదుద్దీన్ గుర్తు చేశారు. అందుకే ఈసారి అందరూ కలసికట్టుగా జగన్ కు ఓటు వేయాలని ఆయన పేర్కొన్నారు.