మహాశివరాత్రి హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటి. ఈ రోజున దేశవ్యాప్తంగా శివాలయాల్లో భక్తులు భారీగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు.
ఈ పర్వదినం పరమేశ్వరుడు , పార్వతీ దేవి కలయికను సూచిస్తుంది. ఆధ్యాత్మిక మేల్కొలుపు, ఆత్మసాక్షాత్కారం, అంతరంగ శాంతికి ఇది ప్రత్యేకమైన రాత్రిగా భావిస్తారు.
ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి తిథినే మహాశివరాత్రి జరుపుకుంటారు. 2026లో ఈ పండుగ ఫిబ్రవరి 15న భక్తులు ఆచరించనున్నారు.
చతుర్దశి తిథి ఫిబ్రవరి 15 సాయంత్రం 5:04 గంటలకు ప్రారంభమై, ఫిబ్రవరి 16 సాయంత్రం 5:34 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో శివారాధన చేయడం శ్రేయస్కరం.
రాత్రి నాలుగు ప్రహరాల్లో పూజలు చేయడం సంప్రదాయం. మొదటి ప్రహరం సాయంత్రం 6:11 నుంచి 9:23 వరకు, రెండో ప్రహరం 9:23 నుంచి అర్ధరాత్రి 12:35 వరకు ఉంటుంది.
మూడో ప్రహరం 12:35 నుంచి ఉదయం 3:47 వరకు, నాలుగో ప్రహరం 3:47 నుంచి ఉదయం 6:59 వరకు కొనసాగుతుంది. నిశిత కాల పూజ అర్ధరాత్రి 12:09 నుంచి 1:01 మధ్య చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని నమ్మకం.
ఈ రాత్రి భక్తులు జాగారం చేసి శివలింగానికి అభిషేకం చేస్తారు. పాలు, పెరుగు, తేనె వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేసి ప్రార్థనలు చేస్తారు.