ఈ ఏడాది కూడా చేప ప్రసాదం.. లేదు!

కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీని నిలిపివేస్తున్నట్లు బత్తిని హరినాథ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచన మేరకు ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఏడాది మృగశిర కార్తె ప్రవేశం రోజున ఆస్తమా రోగులకు బత్తిని హరినాథ్ చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న విషయం విదితమే. కరోనా వ్యాప్తి కారణంగా గతేడాది కూడా చేప ప్రసాదం పంపిణీ చేయలేదు. మృగశిర కార్తె ప్రవేశం రోజున ప్రతి ఏటా మాదిరిగానే జూన్ 7వ తేదీన దూద్బౌలిలోని తన నివాసంలో సత్యనారాయణ వ్రతంతో పాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి 8వ తేదీన చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉదయం 10 గంటలకు తమ కుటుంబ సభ్యులందరం తీసుకుంటామని, అలాగే తమ దగ్గరి బంధువులకు పంపిణీ చేస్తామని బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు.