BR Naidu : అస్సాం సీఎంతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ
అస్సాం రాజధాని గువాహటి (Guwahati) లో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపట్టింది. ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswas Sharma) తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) భేటీ అయ్యారు. గువాహటిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి పలు కీలక అంశాలపై సీఎంతో టీటీడీ చైర్మన్ చర్చించారు. ఆలయ నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు.
దీనికి స్పందించిన సీఎం హిమంత… ఐదు ఎకరాల స్థలంతో పాటు ప్రభుత్వం నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడిరచారు. తమ రాష్ట్ర రాజధానిలో తిరుమల శ్రీవారి అద్భుతమైన ఆలయం నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం ఎంతో గొప్పగా భావిస్తున్నట్లు సీఎం అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించబోయే శ్రీవారి ఆలయం (Srivari Temple) ద్వారా హిందూధర్మ పరిరక్షణ, సంప్రదాయాలు, హిందుత్వ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.







