Pawan Kalyan: రాఖీ పండుగ సందర్భంగా వితంతువులకు చీరలు పంపిన డిప్యూటీ సీఎం
రాఖీ పండుగ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని 1500 మంది వితంతు మహిళలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చీరలను పంపారు. ఈ కానుకలను మహిళలకు అందజేయాల్సిందిగా పిఠాపురం జనసైనికులను ఆయన కోరారు. ఈ అనూహ్య రక్షాబంధన్ బహుమతితో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. వితంతువులందరికీ ఒక సోదరుడిగా తాను ఎప్పుడూ తోడుగా ఉంటానని భరోసా కల్పించాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు జనసేన పార్టీ (Janasena Party) కేంద్ర కార్యాలయం నుంచి పంపిన చీరలను పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ఇంటింటికీ వెళ్లి వితంతువులకు అందజేశారు. పవన్ కల్యాణ్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. పిఠాపురం శాసనసభ్యుడిగా మాత్రమే కాకుండా, ఒక సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా పవన్ (Pawan Kalyan) ఈ కానుకలను పంపారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమం మహిళల పట్ల ఆయనకున్న గౌరవం, సామాజిక బాధ్యతను చాటిచెబుతోందని ఆ ప్రకటనలో వివరించారు.







