Radha Spaces ASBL

కొవ్వూరు ఎన్నికల ప్రచార సభలో జననేత

కొవ్వూరు ఎన్నికల ప్రచార సభలో జననేత

‘చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఒకసారి మోసపోయాం. కాబట్టి మళ్లీ మోసపోకూడదు. అందుకే మార్పు కోసం ఓటు వేయాలని కోరుతున్నాను’ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబునాయుడుకు పొరపాటున మళ్లీ ఓటు వేస్తే ప్రభుత్వ పాఠశాలలు ఏవీ మిగలవన్న ఆయన, ఇప్పటికే 6 వేల స్కూళ్లు మూసివేశారని గుర్తు చేశారు. ఇక ఇంజనీరింగ్‌ ఫీజులు రూ.5 లక్షలు దాటుతాయని.. అన్ని ఛార్జీలలో వీరబాదుడే అని.. ఇళ్లు, భూములు లాక్కుంటారని.. ఏదీ వదలకుండా దోచుకుంటారని.. లారీ ఇసుక లక్ష రూపాయలవుతుందని పేర్కొన్నారు.

ఇంకా గ్రామాల్లో జన్మభూమి కమిటీలు జీవితాలను శాసిస్తాయని.. రైతులకు ఉచిత విద్యుత్‌ ఉండబోదని.. ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ, 108, 104 సర్వీసులు ఇక ఉండనే ఉండవని.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ఉండబోదని.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కనుమరుగవుతాయని జననేత వెల్లడించారు. ఇక తనను వ్యతిరేకించే వారెవ్వరినీ చంద్రబాబు బ్రతకనివ్వరని..  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, నిరుపేదలు, ఇంకా మధ్య తరగతి వారెవ్వరూ బ్రతకలేరని, ఆ విధంగా చంద్రబాబు పాలన ఉంటుందని జననేత అన్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ కేంద్రంలో సోమవారం సాయంత్రం శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పట్టణం జనసంద్రంగా మారింది.

కొవ్వూరు పరిస్థితి

ఈ 5 ఏళ్ల చంద్రబాబునాయుడుగారి పాలన చూశాక, మరో నాలుగు రోజుల్లో ఎన్నికలకు వెళ్తున్న వేళ మనం ఇక్కడ కలిశామని, అందుకే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలని శ్రీ వైయస్‌ జగన్‌ కోరాఆరు. తన సుదీర్ఘ పాదయాత్ర కొవ్వూరు నియోజకవర్గం నుంచి కూడా కొనసాగిందని, ఆరోజు ఇక్కడి విషయాలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు.

పలు ర్యాంపుల నుంచి రోజూ వేల సంఖ్యలో లారీల్లో ఇసుక తరలిస్తున్నారని తెలిపారు. ఇక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు యథేచ్ఛ దోపిడి చేస్తూ, సాక్షాత్తూ సీఎంకు వాటాలిస్తుంటే పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.

పుష్కరాలు–పనులు

పుష్కరాల పనులు అంటే దైవ కార్యానికి సంబంధించినవి కాబట్టి, సక్రమంగా జరుగుతాయని అందరూ భావిస్తారని, కానీ కొవ్వూరు పుష్కరాల పనుల్లో నిధుల దుర్వినియోగంతో పాటు, అవినీతి జరిగిందని జననేత వెల్లడించారు. చెత్త ఏరివేయడం, ఘాట్ల నిర్మాణం, రోడ్లు వేయడం వంటి అన్ని పనులను నామినేషన్‌లో అప్పగించారని, దీంతో అవన్నీ పూర్తిగా నాసిరకంగా జరిగాయని తెలిపారు.

బెల్టు షాపులు

ఈ నియోజకవర్గంలో బెల్టుషాపులు ఎక్కువని, టీడీపీకి చెందిన వారే వాటిని ఎక్కువగా నిర్వహిస్తున్నారని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారని చెప్పారు. బెల్టు షాపులు నియంత్రిస్తానంటూ తొలి సంతకం చేసిన చంద్రబాబు, దాన్ని కూడా అమలు చేయలేదని ప్రస్తావించారు.

విగ్రహాలు తొలగించారు

గోదావరి తీరాన ఒక మంత్రి కుమారుడు రిసార్ట్‌ కట్టాడని, అందుకు అడ్డు వచ్చాయని దేవతల విగ్రహాలు కూడా తొలగించారని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు.

చింతలపూడి ప్రాజెక్టు

చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు ఈ 5 ఏళ్లలో పూర్తి చేయలేదని, కావాలనే పరిహారం ఒక్కో మండలంల ఒక్కో విధంగా పరిహారం ఇచ్చారని, దీంతో రైతులు ఆగ్రహించారని, కోర్టులకు వెళ్లారని, ఆ కారణం చూపి ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఆక్షేపించారు.

ఏం చూశాం?

ఇంకా ఈ 5 ఏళ్లలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదని, దాని వల్ల రైతులు చాలా నష్టపోయారన్న జననేత, ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో మనం చూసింది కేవలం మోసం మాత్రమే అని చెప్పారు. ఇంకా మనకు మోసాలు, అబద్దాలు, అవినీతి, అధర్మం కనిపించాయని అన్నారు.

‘చంద్రబాబునాయుడుకు ఓటు వేస్తే ఏం జరిగిందో మీరంతా చూశారు.  కాబట్టి మళ్లీ పొరపాటున చంద్రబాబునాయుడుకు ఓటు వేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?’ అంటూ అనేక అంశాలు వివరించారు.

పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే?

– ప్రభుత్వ పాఠశాల ఒక్కటి కూడా ఉండదు. ఇప్పటికే ఈ 5 ఏళ్లలో 6 వేల స్కూళ్లు మూసేశారు. 

టీచర్‌ పోస్టులు భర్తీ చేయడం లేదు. సమయానికి పుస్తకాలు పంపిణీ చేయడం లేదు. దగ్గరుండి నారాయణ స్కూళ్లను ప్రోత్సహిస్తున్నారు. అందుకే చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే, పేదలు ఎవ్వరూ తమ పిల్లలను బడికి పంపలేరు. నారాయణ స్కూళ్లలో ఇప్పటికే ఎల్‌కేజీకి రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. ఇక ఆ ఫీజు లక్ష రూపాయలకు చేరుతుంది.

– ఇంజనీరింగ్‌ ఫీజులు రూ.5 లక్షలు దాటుతాయి

ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫీజులు ఇప్పటికే లక్ష రూపాయలు దాటాయి. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఇంజనీరింగ్‌ ఫీజులు రూ.5 లక్షలు దాటుతాయి. కాబట్టి మన ఆస్తులు అమ్ముకున్నా పిల్లలను చదివించలేము.

– అన్ని ఛార్జీలు వీరబాదుడే

ఇప్పటికే కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, పెట్రోల్‌ డీజిల్‌ ధరలు బాదుడే బాదుడు. ఇక ముందు వీరబాదుడే.

– ఇళ్లు, భూములు లాక్కుంటారు

ఇప్పటికే భూములు, ఇళ్లు ఇష్టానుసారం లాక్కోవడానికి భూసేకరణ చట్టం సవరించారు. వెబ్‌ల్యాండ్‌ పేరిట రికార్డులు తారుమారు చేస్తున్నారు. రికార్డులు మాయం చేస్తున్నారు. మళ్లీ పొరపాటున ఓటేస్తే, ఆయన ఇష్టం వచ్చినట్లు, తన అత్తగారి సొత్తు అన్నట్లుగా ఇళ్లు, భూములు లాక్కుంటారు. అవేవీ మీకు మిగలవు.

– అన్నీ దోచుకుంటారు

ఇప్పటికే ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, పొలాలు, నదులు అన్నీ దోచేస్తున్నారు. ఇక మళ్లీ ఓటేస్తే అవేవీ మిగలవు.

 – లారీ ఇసుక ఇప్పటికే రూ.40 వేలుంది. అది లక్ష రూపాయలవుతుంది.

– గ్రామాల్లో జన్మభూమి కమిటీలు జీవితాలను శాసిస్తాయి.

ఇప్పటికే జన్మభూమి కమిటీలు మాఫియాలా మారాయి. అవి ప్రతి పనికి లంచం తీసుకుంటున్నాయి. ఎవరైనా పెన్షన్‌ కావాలంటే, ఏ పార్టీకి చెందిన వారని, ఎవరికి ఓటేశారని అడుగుతున్నాయి.

మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే, జన్మభూమి కమిటీలు మనందరి జీవితాలను శాసిస్తాయి. మీరు ఏ సినిమా చూడాలో, టీవీ ఛానల్‌ చూడాలో, ఏ పత్రిక చదవాలో, పిల్లలను ఏ స్కూల్‌కు పంపాలో, వైద్యం కోసం ఏ ఆస్పత్రికి వెళ్లాలో కూడా వారే నిర్ణయిస్తారు. నిర్దేశిస్తారు. అప్పుడు వారు చెప్పినంత ఫీజులు కట్టాల్సి ఉంటుంది. 

– రైతులకు ఉచిత విద్యుత్‌ ఉండదు.

ఇప్పటికే రోజుకు 7 గంటల విద్యుత్‌ కూడా సరఫరా సక్రమంగా లేదు. పగలు 3 గంటలు ఇస్తే, రాత్రి 4 గంటలు ఇస్తున్నారు.

– ఆరోగ్యశ్రీ పథకం, 108, 104 సర్వీసులు కనిపించవు.

ఇప్పటికే ఆ పథకాలు కొన ఊపిరితో ఉన్నాయి. 108కు ఫోన్‌ చేస్తే అంబులెన్సులు రావడం లేదు.

– ఫీజు రీయింబర్స్‌మెంటు ఉండదు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా కొన ఊపిరిలో ఉంది. దీంతో తల్లిదండ్రులు అప్పుల పాలవుతుంటే, పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే మొత్తం కోత పెడతారు.

– ఇల్లు అన్నది మర్చిపోవాలి

ఇప్పటికే గ్రామానికి 10 ఇళ్లు కూడా ఇవ్వడం లేదు. మరోసారి ఆయనకు ఓటేస్తే, ఇల్లు అన్న మాట మర్చిపోవాలి.

– సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఏవీ ఉండవు

1994 ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం, రెండు రూపాయలకే కిలో బియ్యం హామీలతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాది ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సీఎం కాగానే, సంపూర్ణ మద్య నిషేధం ఎత్తివేశారు. రెండు రూపాయల కిలో బియ్యం ధర రూ.5.25 చేశారు.

ఇదీ చంద్రబాబు నైజం. ఈ 5 ఏళ్లలో ఆయన పాలన కూడా మీరు చూశారు. 

– పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ రాకపోగా, ఇచ్చే ఇతర    రుణాలపై వడ్డీని బాదుతారు. వారికి రుణ మాఫీ కూడా చేయలేదు.

– ఇప్పటికే రైతులకు సున్నా వడ్డీ పథకం రదై్దంది. మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే.. రైతులకు కూడా బ్యాంకుల రుణాలు బంద్‌ అవుతాయి. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అంటారు. 

– ఎన్నికలకు మూడు నెలల ముందు స్కీమ్‌లు చూపుతున్నారు. ఎన్నికల తర్వాత అవేవీ కొనసాగవు. ఏ పథకం కనిపించదు.

– గ్రామాలలో తనను వ్యతిరేకించే వారెవ్వరినీ చంద్రబాబు బతకనివ్వడు. 

ఇప్పటికే అన్ని చోట్లా తన పోలీసులను పెట్టుకుంటాడు. సీబీఐని, ఈడీని రానివ్వడు. ఇప్పటికే మొత్తం మీడియాను కొనేశాడు. అందుకే ఎవరిని చంపినా ఎక్కడా బయటకు రాదు. రాసే వాళ్లు ఉండరు. చూపే వారుండవు. ఇకం కేసులూ ఉండవు. మనుషులను చంపి, తిరిగి వాళ్ల బం«ధువులే చంపారని ప్రచారం చేస్తారు.

– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు బతకరు.

ఒకరిద్దరు బీసీలు జడ్జీలు కాకండా కొలీజియమ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. కాబట్టి చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలతో పాటు, పేదలు, మధ్య తరగతి వారెవ్వరూ ఉండరు.

అంటూ ఇవన్నీ వివరించిన శ్రీ వైయస్‌ జగన్, చంద్రబాబు ఈ చివరి మూడు నెలలు చేస్తున్న డ్రామాలు, చేస్తున్న ప్రచారాలు, టీవీల ప్రకటనలను కనుక పొరపాటున నమ్మితే.. ‘నర మాంసం తినే ఒక అందమైన రాక్షసిని నమ్మితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది’ అని పోల్చారు.

మార్పు కోసం ఓటేయండి

ఒకసారి మోసపోయాం. కాబట్టి మళ్లీ మళ్లీ మోసపోకూడదు. అందుకే మార్పు కోసం ఓటు వేయాలని ఆయన కోరారు.  

వ్యవస్థ మారాలి

ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని, ఒక నాయకుడు ఏదైనా చేస్తానని చెప్పి, ఆ అంశాన్ని ప్రణాళికలో పెట్టి, ప్రజలను ఓటు అడిగి, ఓటు వేయించుకుని గెల్చిన తర్వాత, దాన్ని అమలు చేయకపోతే, ఆ పదవిని వీడి ఇంటికి పోవాలని, అప్పుడే ఈ రాజకీయాలలో నిజాయితీ, విశ్వసనీయత వస్తాయని స్పష్టం చేశారు. అందుకు అందరి సహకారం కావాలని కోరారు.

కుట్రలు–కుతంత్రాలు

‘చంద్రబాబునాయుడు కుట్రలు మీరందరూ చూస్తున్నారు. గత నెల రోజులుగా మీరు టీవీలు చూస్తే, మీ అందరికి కనిపిస్తుంది. రోజుకొక కుట్ర పన్నుతున్నారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపుతున్నారు. ప్రతి రోజు ఒక పుకారు లేపుతారు. ఆ పుకారు మీద చర్చ పెడతారు. అలా 5 ఏళ్ల చంద్రబాబునాయుడు మోసపూరిత పాలన మీద మాత్రం చర్చ జరగకుండా జాగ్రత్త పడుతున్నారు’ అని జననేత పేర్కొన్నారు.

వారందరితో యుద్ధం

ఇవాళ ధర్మం–అధర్మం మధ్య ఈ యుద్ధం జరుగుతోందని, ఇంకా ఈ యుద్ధం కేవలం చంద్రబాబునాయుడు గారితో మాత్రమే కాకుండా, ఆయనకు కొమ్ము కాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు, ఆయనకు అమ్ముడుపోయిన మొత్తం ఛానళ్లతో యుద్ధం చేస్తున్నామని చెప్పారు. 

దృష్టి మళ్లిస్తున్నారు 

‘చంద్రబాబునాయుడు గారి 5 ఏళ్ల పాలన మీద చర్చ జరిగితే, వారందరికి తెలుసు.. చంద్రబాబు పాలన మీద, ఆయన చేసిన మోసాల మీద ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే చంద్రబాబునాయుడుకు డిపాజిట్లు కూడా రావని వారందరికీ తెలుసు. కాబట్టే ఆ చర్చ జరగకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి రోజూ కుట్ర చేస్తున్నారు’ అని చెప్పారు.  

గ్రామాలకు మూటల డబ్బులు

ఎన్నికలు ఇంకా దగ్గరకు వచ్చే సరికి కుట్రలు మరింత తీవ్రమవుతాయని,  ఎన్నికలు రావడంతో ప్రతి గ్రామానికి మూటలకొద్దీ డబ్బు పంపిస్తారని, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారని, ఆ విధంగా మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.

ఈ కుట్రను జయించాలని, అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతును కలిసి, చంద్రబాబు చేస్తున్న మోసాలు వివరించాలని కోరారు.

వారికి ఇవన్నీ వివరించండి

‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. నాలుగు రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదని, పిల్లల చదువు కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని గుర్తు చేయండి’.

‘అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోకుండా, నాలుగు రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని, ఆ తర్వాత మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ వంటి ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి’. 

‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను కలవండి. చెప్పండి. చంద్రబాబు చేసే మోసాలకు బలి కావద్దని చెప్పండి. అక్కా చంద్రబాబుకు 5 ఏళ్ల సమయం ఇచ్చాం. ఎన్నికలప్పుడు మన రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఈ 5 ఏళ్లలో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? అని అడగండి. అదే విధంగా సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని గుర్తు చేయండి. ఆ పథకాన్ని రద్దు చేశాడని కూడా చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, పసుపు–కుంకుమ పథకం డ్రామాకు అస్సలు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి’.

‘అక్కా నాలుగు రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తర్వాత ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నాలుగు దఫాల్లో నేరుగా అక్కా చెల్లెమ్మల చేతుల్లోను పెడతాడని ప్రతి అక్కకు చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని, అది ఆయన కొడుకు జగనన్నతోనే సా««ధ్యమని చెప్పండి’. 

‘పేదరికంలో ఉన్న ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారిని కలవండి. నాలుగు రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం, ఆ తర్వాత అన్న వైయస్సార్‌ చేయూత పథకం తీసుకొస్తారని, ప్రతి అక్కకు నాలుగు దఫాల్లో రూ.75 వేలు చేతిలో పెడతాడని చెప్పండి’.

‘గ్రామాల్లో ప్రతి రైతన్న దగ్గరకు వెళ్లండి. చంద్రబాబుకు 5 ఏళ్ల సమయం ఇచ్చాం. కానీ రుణమాఫీ చేయలేదు. రుణ మాఫీ కోసం చంద్రబాబు ఇచ్చిన మొత్తం కనీసం వడ్డీలకు అయినా వచ్చిందా? అని అడగండి. అలాగే సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని, ఆ పథకాన్ని రద్దు చేశారని చెప్పండి. అలాగే 5 ఏళ్లలో ఏ ఒక్క సంవత్సరమైనా, ఏ ఒక్క పంటకైనా, ఒక్కసారైనా గిట్టుబాటు «ధరలు వచ్చాయా? అని అడగండి’.

‘అందుకే ప్రతి రైతుకు చెప్పండి. అన్నా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, నాలుగు రోజులు ఓపిక పడదాం. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఆ తర్వాత ప్రతి రైతుకు పెట్టుబడిగా ఏటా మే మాసంలో రూ.12,500 ఇస్తాడని, అలా నాలుగేళ్లలో మొత్తం రూ.50 వేలు మీ చేతిలో పెడతాడని చెప్పండి. అదే విధంగా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, మళ్లీ సున్నా వడ్డీ రుణాలు వస్తాయని, అది జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. ఇంకా ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు. గిట్టుబాటు ధరలకు అన్న  గ్యారెంటీ కూడా ఇస్తాడని చెప్పండి’.

‘గ్రామంలో ప్రతి అవ్వ, ప్రతి తాతను కలవండి. వారిని ఒకే విషయం అడగండి. అవ్వా ఇవాళ అంటే ఎన్నికలు వచ్చాయి. కానీ మీకు రెండు నెలల క్రితం వరకు ఎంత పెన్షన్‌ వచ్చేదని అడగండి. అప్పుడు ఆ అవ్వ అంటుంది అసలు పెన్షన్‌ వచ్చేది కాదని, లేదా వెయ్యి రూపాయలు వచ్చేవని చెబుతుంది. అవ్వ ఆ సమాధానం చెప్పాక ఆ అవ్వను అడగండి. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్నే రూ.2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే, ఈ చంద్రబాబు రూ.2 వేలు ఇచ్చేవాడా?’ అని అడగండి.

‘అందుకే ప్రతి అవ్వకు చెప్పండి. ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దని, నాలుగు రోజులు ఓపిక పడితే, మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పండి. అలా మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పెన్షన్‌ రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాడని ప్రతి అవ్వకూ చెప్పండి’.

‘గ్రామాలలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. చంద్రబాబు పరిపాలన చూశాం. ఊరికి కనీసం 10 ఇళ్లు కూడా కట్టలేదని గుర్తు చేయండి. కాబట్టి, ఒక నాలుగు రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, అప్పుడు అన్న అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తాడని చెప్పండి’ అని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు.

నవరత్నాలు

నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాతకు వాటి గురించి వివరించాలని కోరారు.

నవరత్నాలతో ప్రతి నిరుపేదల జీవితాలు మారుతాయని, వాటి వల్ల రైతన్నల ముఖాల్లో చిరునవ్వులు చూడవచ్చని నమ్ముతున్నానని, అందుకే ఆ పథకాలను కచ్చితంగా ప్రతి ఇంటి గడపకు చేరుస్తామని హామీ ఇచ్చారు.

మార్పు కోసం..

ఇంకా  ఈ చెడిపోయిన వ్యవస్థకు వ్యతిరేకంగా, మార్పు కోరుతూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 

పార్టీ అభ్యర్థుల పరిచయం

కొవ్వూరు నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తానేటి వనితతో పాటు, పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ఎం.భరత్‌ను సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

Tags :