చిత్తూరులో వైభవంగా జరిగిన తానా చైతన్యస్రవంతి
సాంస్కృతిక కళోత్సవాలు, సైకిళ్ళు, స్కాలర్ షిప్లు, కుట్టుమిషన్ల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా చిత్తూరులో డిసెంబర్ 29వ తేదీన జరిగిన తానా కళోత్సవం, సేవా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగింది. చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి, చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్ సునీల్ పంట్ర, లోకేష్ కొణిదెల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, మల్లికార్జున వేమన తదితర తానా నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, మేయర్ ఎస్ అముద, ఎమ్మెల్సీ బి.ఎన్. రాజసింహులు, ఆర్టీసి వైస్ చైర్మన్ ఎం.సి. విజయానంద్ రెడ్డి, పులివర్తి నాని, డిప్యూటీ జడ్పి చైర్మన్ ధనుంజయ రెడ్డి, మాజీ జడ్పి చైర్మన్ చంద్ర ప్రకాష్, గాలి భానుప్రకాశ్, కఠారి హేమలత తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా రెడ్క్రాస్ శాఖ సహకారంతో తానా చేయూత కార్యక్రమంలో భాగంగా మహిళలకు, విద్యార్థులకు, రైతులకు, దివ్యాంగులకు, ఆర్థికంగా, ఉపాధిపరంగా చేయూతనిచ్చారు. 100 మంది పేద ఉత్తమ విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000/- చొప్పున స్కాలర్ షిప్ లను అందజేశారు. ఈ స్కాలర్ షిప్లను మోహన్ ఈదర స్పాన్సర్ చేశారు. అలాగే 8 మంది మహిళలకు ఉపాధి కల్పన కోసం కుట్టు యంత్రాలను(టైలరింగ్ మిషన్లు) పంపిణీ చేశారు. 15 మంది ఉత్తమ రైతులను సన్మానించడంతోపాటు వారికి అవసరమైన వ్యవసాయ రక్షణ పరికరాలను అందజేశారు. 18 మంది దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్ళను ఇచ్చారు. 30 మంది పేద ఉత్తమ విద్యార్థులకు సైకిళ్ళను బహుకరించారు. ఈ వేడుకల్లో భాగంగా 10 మంది సంఘ సేవకులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా దాదాపు 60 మంది విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మందికిపైగా ప్రేక్షకులు హాజరై తానా నాయకులను అభినందించారు.
ఈ వేడుకల్లో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ, తాము అమెరికాలో ఉన్నా జన్మభూమి అభివృద్ధికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీకి సేవ చేయాలన్న తలంపుతోనే ఉంటామని చెప్పారు. తానా చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు.
తానా చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్ సునీల్ పంత్ర మాట్లాడుతూ, తానా, తానా ఫౌండేషన్ ద్వారా చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో అన్నీ చోట్ల ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. చిత్తూరులో కూడా తమవంతుగా సేవలందించాలన్న తలంపుతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పలువురికి సహాయాన్ని అందించామని చెప్పారు.
తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన మాట్లాడుతూ, తానా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అంటూ తామంతా అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోని కమ్యూనిటీకి ఎల్లప్పుడు సహాయపడుతుంటామని చెప్పారు. తానా 2023 మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి మాట్లాడుతూ తానా వచ్చే సంవత్సరం నిర్వహించే మహాసభలకు అందరూ రావాలని తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. వీరితోపాటు పలువురు ప్రముఖులు కూడా ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులకు సేవా పురస్కారాలను తానా అందజేసింది. బాలాజీ హేచరీస్ అధినేత వి.సుందరనాయుడు (నెక్ రమేష్ పురస్కారాన్ని స్వీకరించారు), స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్, కట్టమంచి బాలకృష్ణారెడ్డి, పార్థసారథినాయుడు, డాక్టర్ రామలక్ష్మి, డాక్టర్ రమాదేవి, శ్యామల, జోసెఫ్ను సేవా పురస్కారంతో సత్కరించారు. కళోత్సవంలో బిగ్బాస్ ఫేం గీతూ రాయల్ చిత్తూరు యాసలో మాట్లాడి అలరించారు.
ఈ కార్యక్రమ విజయవంతానికి సునీల్ పంట్రతోపాటు మోహన్ ఈదర, హేమంత్ కూకట్ల, ఉప్పలపాటి రమేష్ బాబు, లంకపల్లి మహదేవ నాయుడు (చిత్తూరు జిల్లా ప్రవాస భారతీయుల సంఘం), సాధు దిలీప్ కృషి చేశారు.