Radha Spaces ASBL

విజయవాడ కెఎల్‌ యూనివర్సిటీలో ‘తానా - సాంస్కృతిక కళోత్సవాలు’కు అద్భుత స్పందన!

విజయవాడ కెఎల్‌ యూనివర్సిటీలో ‘తానా - సాంస్కృతిక కళోత్సవాలు’కు అద్భుత స్పందన!

విజయవాడ  కెఎల్‌ యూనివర్సిటీలో ‘తానా’చైతన్య స్రవంతి’వారి ‘తానా - సాంస్కృతిక కళోత్సవాలు’, ‘తానా’ చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్‌ - సునీల్‌ పంత్ర మరియు ‘తానా’కమ్యూనిటీ సర్వీసెస్‌ కో-ఆర్డినేటర్‌, ‘తానా సాంస్కృతిక కళోత్సవాలు’ సమన్వయకర్త రాజా కసుకుర్తి  సమన్వయంలో, తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు సారథ్యం లో వందలాది మంది కళాకారుల నృత్య ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరిగాయి. 

‘తానా’చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్‌ - సునీల్‌ పంత్ర మాట్లాడుతూ, డిసెంబరు 2, 2022 వ తేదీ నుంచి జనవరి 7, 2023  వరకు 100 కు పైగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి,  రెండు భాగాలుగా చేయడానికి తల పెట్టాము అనీ,  మెడికల్‌, హెల్త్‌, విద్యా, గ్రామీణ సదుపాయాలు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్స్‌, రైతు రక్షణ లాంటి కార్యక్రమాలు తానా కళోత్సవాలు - సంగీత, నృత్య, జానపద, సాంస్కృతిక కళలు ప్రోత్సాహం వంటివి ఇందులో ఉన్నాయన్నారు. శ్రీమాకు  కెఎల్‌ యూనివర్సిటీ ఆడిటోరియం ఇచ్చిన యాజమాన్యం మరియు పూర్తి సహకారం అందించిన భార్గవ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. 

‘తానా’ కమ్యూనిటీ సర్వీసెస్‌ కో-ఆర్డినేటర్‌  మరియు ‘తానా సాంస్కృతిక కళోత్సవాలు’ సమన్వయకర్త - రాజా కసుకుర్తి మాట్లాడుతూ సభకు విచ్చేసిన ముఖ్య అతిథి డా. రమేష్‌ పోతినేనికి, వేదికను అలంకరించిన ‘తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, పెద్దలు, కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ఠ కళాకారులకు స్వాగతం పలికి, కళా ప్రదర్శనలను ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షిస్తున్న అందరికీ శుభాభినంనదనలు తెలియజేశారు. 

ఈరోజు తానా - కళోత్సవాలను విజయవాడ పరిసర ప్రాంతాలలోని కెఎల్‌ యూనివర్సిటీ లో చేయడానికిగల ప్రధానోద్దేశం ఏమిటంటే, మేము చిన్నతనంలో గ్రామాల్లో చదువుకొనే రోజుల్లో, మన పండుగలు, తిరునాళ్ళు లో అనేక కళలు చూసేవాళ్ళం సంక్రాంతికి హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలు, బుడ బుక్కలు, దసరా వేషాలతో నాట్యాలు, కోలాటం, చెక్క భజన లాంటి ఎన్నో అద్భుతమైన నాట్య ప్రదర్శనలను జరిగేవని, అవి మనస్సుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగించేవని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెటూరు మరియు పట్టణ ప్రాంతాల్లో అవి కనుమరుగు అయి పోతున్నాయని ఇప్పటితరం పిల్లలు మన పూర్వీకులు మనకందించిన కళలను చూడలేకపోతున్నందుకు బాధగా వుందని, మన కళలను పరిరక్షించి, కనుమరుగవుతున్న గ్రామీణ కళలను మన భావితరాలకు అందించే బాధ్యత మన అందరిపై వుందని గుర్తు చేశారు. కళలు మనో వికాసానికి దోహదపడమే కాక, మానసిక వత్తిడి తగ్గించి, మంచి సామాజిక , స్నేహ బృందాలను పెంపొందించు కోవడానికి ఉపయోగపడతాయని, అందుకే మన యువతకు కళలపై ఆసక్తి పెంపొందించి , కళలలో యువతను భాగస్వాములు చేయాలనే సదుద్దేశంతో ‘తానా’ ద్వారా ఈ కార్యక్రమాలను మీముందుకు తీసుకు వస్తున్నాం, మీ అందరూ కళలను ఆదరించాలని కోరారు. ఈరోజు 25కు పైగా కళా బృందాలు, వివిధ   కళారూపాలను అత్యంత వైభవంగా ప్రదర్శనలు ఇవ్వడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు! ‘తానా’ విద్యారంగానికి చేయూతను ఇచ్చే మరిన్ని కార్యక్రమాలతో పాటు, గ్రామీణ శ్రేయస్సుకు ఉపయోగకరమైన పనులు మరియు సహాయ సహకారాలను అందించడానికి కృషి చేస్తుంది అని చెప్పారు. 

ముఖ్య అతిథిగా విచ్చేసిన రమేష్‌ హాస్పిటల్స్‌ అధినేత డా. రమేష్‌ పోతినేని మాట్లాడుతూ, తనకు  కెఎల్‌  యూనివర్సిటీతో మంచి అనుబంధం వుందని, చిన్ననాటి మిత్రులను కొందరిని ఈ కార్యక్రమంలో కలుసుకోవడం చాలా ఆనందంగావుందని అన్నారు. ప్రత్యేకంగా 45 సంవత్సరాల నుంచి ‘తానా’ లాంటి స్వచ్ఛంద సంస్థ ప్రవాసంలో తెలుగు వారికి సేవలు అందిస్తూ, మాతృభూమిపై మక్కువతో చక్కటి నిబద్దతతో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అందిస్తున్న సేవలను కొనియాడారు. తానా సంస్థ వారు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా తన పూర్తి సహాయ సహకారాలను  అందించగలనని చెప్పారు. గతంలో ‘టెలీ మెడిసిన్‌’ అనే కార్యక్రమం ఈ యూనివర్సిటీ ఆడిటోరియం నుంచే చేయడం జరిగిందని, దానికి మంచి స్పందన లభించిందని గుర్తు చేసుకున్నారు. డా. ఉమ కటికి మహిళలు పురోగతి కోసం ‘తానా ఉమెన్‌ ఎంపవర్మెంటు’ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.

తానా కార్యదర్శి సతీష్‌ వేమూరి మాట్లాడుతూ ఈ చక్కటి గ్రామీణ , జానపద నృత్య ప్రదర్శనలు మేము ప్రత్యక్షంగా చూడడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను అని, ఇటువంటి చక్కటి కళలను మరుగున పడి పోకుండా, బ్రతికించాలనే ఆలోచనకు శ్రీకారం చేపట్టిన సునీల్‌ పంత్ర, అంజయ్య చౌదరి, రాజా కసుకుర్తి మరియు తానా కార్యవర్గం , ఫౌండేషన్‌ వారికి ధన్యవాదాలు తెలియజేశారు!

ప్రతిష్ఠాత్మకమైన డ్యాన్స్‌ అకాడమీగా పేరు పొంది మోడీ జీ ‘నమో సింగపూర్‌’పర్యటన ఈవెంట్లో మన్ననలు, ఒబామా భారత పర్యటనలో నృత్య ప్రదర్శన, మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర ముఖ్య మంత్రుల సమక్షంలో ఎన్నో ప్రదర్శనలు యిచ్చి, తమ ప్రతిభతో భారత ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసి అందరి మన్ననలు పొందిన, తణుకు నుంచి విచ్చేసిన అంబిక డ్యాన్స్‌ అకాడమి/నృత్యాలయం వారి రింగ్‌ డ్యాన్స్‌, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీమతి దుర్గా మల్లీశ్వరి సిద్ధార్థ మహిళా కళాశాల బృందం వారు ఫోక్‌ ఆర్కెస్ట్రా కళా ప్రదర్శన నవ్య ఆధునిక పరికరాలు వాడకుండా, ప్రత్యేక ఫోక్‌ పరికరాలతో ఇచ్చిన డప్పులు, కోలాటం, చిడతలు, సన్నాయి, మురళీ గానం వంటి ప్రదర్శనలు కొత్త పుంతలు తొక్కి, ఆదివాసి నృత్య ప్రదర్శనలను తలపించేలా అందరినీ ఆకట్టుకున్నాయి. 

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ విజయవాడ మరియు కెఎల్‌ యూనివర్సిటీ తో తనకు ఒక ప్రత్యేకత అనుబంధం వుంది అని, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేపట్టడానికి సన్నాహాలు చేసిన రాజా కసుకుర్తి, సునీల్‌ పంత్ర, భార్గవ్‌కు కృతజ్ఞతలు తెలియ చేశారు. 46 సం. చరిత్ర గల ‘తానా’సంస్థ మన మాతృగడ్డపై చేపడుతున్న  రైతు కోసం, మనవూరు, ఆదరణ, కంటి ఆపరేషన్‌, క్యాన్సర్‌ క్యాంపులు, లైబ్రరీలు, విద్యాదానం, స్కాలర్‌ షిప్‌, డిజిట్‌ల్‌ క్లాస్‌ రూమ్‌ల ఏర్పాటు వంటి ఎన్నో కార్యక్రమాలను, దాతల సాయంతో కోట్లరూపాయలు వెచ్చించి అధ్భుతమైన సేవా కార్యక్రమాలను మీముందుకు తీసుకువచ్చామన్నారు. తానా టీమ్‌ స్వ్కేర్‌ ద్వారా తెలుగు వారికి, విద్యార్థులకు చేస్తున్న సేవ ఉత్తమమైనదని, యూత్‌ కోసం తెలుగు నేర్పించడం, కళాశాల ద్వారా ప్రవాసంలో వున్న పిల్లలకు సర్టిఫికేషన్‌ కోర్సులు, సాహిత్య సేవలు వంటివి చేస్తున్నామని తెలిపారు.

డాక్టర్‌  జెవి రావు మాట్లాడుతూ పూర్వం రాజులు కళలను, పోత్సహించేవారు, మన దేవాలయ ల పై కళాత్మక చిత్రాలను చిత్రీకరణ చేశారు! ఇప్పుడు కళారూపాలకు ఆదరణ మరుగు అవుతున్న తరుణంలో, వాటిని పరిరక్షించే దిశగా, ‘తానా’ వారు చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. తానాకు సహకారాన్ని అందించిన డా. జెవి రావు,డా. రమేష్‌,  వెంకటరావు గారు తదితరులను తానా అధ్యక్షులు, తానా బృందం వారు ఘనంగా సత్కరించారు!

గుడివాడ మాధవి సిస్టర్స్‌ నృత్యం, శ్రీదేవి సాంస్కృతిక సంఘం బృందావన కృష్ణుడుపై మహిళల కోలాటం ప్రదర్శన పిబి సిద్దార్ద కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు వారి డప్పుల ఫోక్‌ డ్యాన్స్‌ ప్రదర్శన, జవాన్‌ మరియు కిసాన్‌ ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లు తెలియజేసే నాటికను ప్రదర్శించారు. తానా ఫౌండేషన్‌ శశికాంత్‌ వల్లేపల్లి, చేయూత కార్యక్రమం ద్వారా ‘లీడ్‌ ద ఫౌండేషన్‌’ మరియు ఆరమండ్ల అచ్యుతరావు, ఆరమండ్ల లీలాబాయి జ్ఞాపకార్థం, 13 మందికి విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లను అందజేశారు. 

ఫ్యూజన్‌ విత్‌ వీణ మరియు గిటార్‌ పై నాదం అనే కార్యక్రమం వీనులవిందు చేసింది. రాజీవ్‌ మరియు టీమ్‌ డప్పుల ప్రదర్శన, దుర్గా మల్లీశ్వర మహిళా కళాశాల విద్యార్థులు 13 కళలలో ఒకటైన, చెక్క భజన కళారూపం కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. గంగా జాతర జానపద నృత్యాలు, ప్రతిభ గల బాలికల గ్రూపుతో చెక్క భజనలు నిర్వహణ, తెలుగు గ్రామీణ విశిష్టతను తెలియజేసే అధ్భుతమైన ప్రదర్శనలతో మన కళలకు జీవం పోశారు.

ఈ కార్యక్రమంలో తానా నాయకులు పురుషోత్తం చౌదరి, రఘు ఎదులపల్లి, ఠాగూర్‌ మలినేని, శ్రీనివాస్‌ కూకట్ల, నాగ పంచుమర్తి, జోగేశ్వరరావు పెద్దిబోయిన, తదితరులు పాల్గొన్నారు. 
 

Click here for Event Gallery

 

 

Tags :