Radha Spaces ASBL

విజయవంతంగా కేటీఆర్ అమెరికా పర్యటన

విజయవంతంగా కేటీఆర్ అమెరికా పర్యటన

ఎన్నారైలతో సమావేశాలు...పారిశ్రామిక ప్రముఖులతో చర్చలు..

తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అమెరికా పర్యటన విజయవంతంగా జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి తెలుగువారితో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రగతిలో, మనఊరు మన బడి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వనించారు. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నవాతావరణాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ పేరు తెచ్చుకున్న విషయాన్ని, తెలంగాణ రాష్ట్రం పెట్టుబడిదారులకు ఇస్తున్న అనుమతులు, రాయితీల వివరాలను తెలియజేశారు. ఈ పర్యటనలో వివిధ కంపెనీలు తమ కార్యాలయాలను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. మరోవైపు తెలుగు ఎన్నారైలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో తమవంతు కృషి చేస్తామని హామి ఇచ్చారు. మనఊరు`మనబడి కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు ఆసక్తి చూపించారు.ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్‌ వెంట పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌, రాష్ట్ర లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ ఉన్నారు.

రూ.3,250 కోట్ల పెట్టుబడులకు దిగ్గజ కంపెనీల సంసిద్ధత

పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశం అనంతరం నాలుగు ప్రఖ్యాత కంపెనీలు దాదాపు రూ.3,250 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలు చేశాయి. న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ రాష్ట్రంలోని ఫార్మా రంగంలో రూ.1,750 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌ అడ్వెంట్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ జాన్‌ మాల్డోనాడోతో  సమావేశమైనప్పుడు ఈమేరకు తెలియజేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఆర్‌ఏ కెమ్‌ ఫార్మా లిమిటెడ్‌, అవ్రా ల్యాబొరేటరీస్‌ సంస్థల్లో మెజారిటీ వాటాలు కొనేందుకు రూ.1,750 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ఈ సందర్భంగా మాల్డోనాడో తెలిపారు. ఆర్‌ఏ కెమ్‌ సంస్థ ఔషధాల్లో ప్రభావవంతమైనవిగా పరిగణించే పెల్లెట్స్‌ తయారీతోపాటు బీ టూ బీ ఫార్ములేషన్స్‌, క్లినికల్‌ స్టడీస్‌ రంగంలో పనిచేస్తున్నది. 1984లో స్థాపించిన అడ్వెంట్‌ కంపెనీ 42 దేశాల్లో ఆరోగ్య, ఆర్థిక, రిటైల్‌, పారిశ్రామిక, టెక్నాలజీ రంగాల్లో సుమారు రూ.4.60 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది.

20 మిలియన్‌ డాలర్లతో స్లేబ్యాక్‌..

న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్‌ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. వచ్చే మూడేండ్లలో 20 మిలియన్‌ డాలర్లు (రూ.1,500 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపింది. సీజీఎంపీ ల్యాబ్‌తోపాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నది. గత ఐదేండ్లలో హైదరాబాద్‌లో స్లేబ్యాక్‌ సుమారు రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. మంత్రి కేటీఆర్‌తో సమావేశం తరువాత స్లేబ్యాక్‌ ఫార్మా వ్యవస్థాపకుడు, సీఈవో అజయ్‌ సింగ్‌ ఈ భారీ పెట్టుబడి ప్రకటన చేశారు. అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి జెనరిక్‌ ఔషధాల తయారీ అనుమతులు పొందడానికి అవసరమైన క్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన ఘనత తమ కంపెనీదని వెల్లడించారు. హైడ్రాక్సీప్రోజెస్టెరాన్‌ 5 ఎంఎల్‌ జెనరిక్‌ ఔషధాన్ని అమెరికన్‌ మారెట్‌లో తొలిసారి ప్రవేశపెట్టింది తామేనని పేర్కొన్నారు. ఈ కంపెనీ 35 మంది సిబ్బందితో 2017లో హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం 3 యూనిట్లలో 106 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

హైదరాబాద్‌ ఫార్మారంగంలో స్లేబ్యాక్‌ ఫార్మా అసాధారణ ఎదుగుదల, విస్తరణ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి హైదరాబాద్‌ లో ఉన్న అనుకూలతలను ఉపయోగించుకుని స్లేబ్యాక్‌ కంపెనీ మరిన్ని విజయాలను సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ లోని అనేక లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు తమ విజయాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని కేటీఆర్‌ చెప్పారు.

జీనోమ్‌ వ్యాలీకి ఫార్మా కొపియా

హైదరాబాద్‌ ఫార్మా రంగంలోకి యునైటెడ్‌ స్టేట్స్‌ ఫార్మా కొపియా సంస్థ కూడా చేరనున్నది. రెండు లక్షల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషధ తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని జీనోమ్‌వ్యాలీలో ఏర్పాటు చేయనున్నట్టు. మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఆ సంస్థ చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ కేవీ సురేంద్రనాథ్‌ తెలిపారు. గత ఐదేండ్లలో ఇక్కడ 5 మిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడి పెట్టి 70 మందికి ఉద్యోగాలు కల్పించామని, తాజాగా ఏర్పాటుచేయనున్న అడ్వాన్స్‌డ్‌ ల్యాబ్‌లో మరో 50 మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుందని వెల్లడిరచారు. 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటుచేసే అత్యాధునిక ల్యాబ్‌కు సింథటిక్‌, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉంటుందని వివరించారు.

గ్లోబల్‌ షేర్డ్‌ సర్వీసెస్‌ సెంటర్‌ విస్తరణ

న్యూయార్‌ కేంద్రంగా గల క్యూరియా గ్లోబల్‌ హైదరాబాద్‌లోని తన కేంద్రాన్ని విస్తరించి ఉద్యోగుల సంఖ్యను ఏడాదిలోగా రెట్టింపు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఈ కంపెనీ మనదేశంలో 27 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇతర క్యూరియా గ్రూప్‌ సంస్థలు, థర్ట్‌ పార్టీ సంస్థల కోసం ఔషధ తయారీ, ఒప్పంద పరిశోధన కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తున్నది. క్యూరియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌ పాండియన్‌తో మంత్రి కేటీఆర్‌ సమావేశం తరువాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. హైదరాబాద్‌లోని గ్లోబల్‌ షేర్డ్‌ సర్వీస్‌ సెంటర్‌లో ప్రస్తుతం 115 మంది ఉద్యోగులున్నారు.

క్యూరియా గ్లోబల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌తో కేటీఆర్‌ భేటీ

న్యూయార్క్‌ కేంద్రంగా ఉన్న క్యూరియా గ్లోబల్‌  హైదరాబాద్‌ లోని తన కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను రాబోయే 12 నెలల్లో రెట్టింపు చేసే ఆలోచనలో ఉంది. క్యూరియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌ పాండియన్‌ తో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఇప్పటికే ఈ కంపెనీ మనదేశంలో 27 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టిందని తెలియజేస్తూ, కంపెనీని తెలంగాణలో విస్తరిస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌ లోని గ్లోబల్‌ షేర్డ్‌ సర్వీస్‌ సెంటర్‌ లో ప్రస్తుతం 115 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, రాబోయే 12 నెలల్లో మరో 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రకాష్‌ పాండియన్‌ తెలిపారు.

ఈ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్‌ క్యూరియా గ్లోబల్‌ అసాధారణ ఎదుగుదల, దాని విస్తరణ ప్రణాళికలు తనకు సంతోషాన్ని కలిగించాయన్నారు. క్యూరియా గ్రూప్‌ దార్శనికత, లక్ష్యాన్ని సాధించడంలో హైదరాబాద్‌ లోని గ్లోబల్‌ షేర్డ్‌ సర్వీసెస్‌, ఆర్‌ అండ్‌ డి కమ్‌ మాన్యుఫాక్చరింగ్‌ సెంటర్‌ కీలక పాత్ర పోషిస్తాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. క్యూరియా గ్రూప్‌ కు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని కేటీఆర్‌ తెలిపారు.

జాన్సన్‌ ఉపాధ్యక్షునితో కేటీఆర్‌ సమావేశం

అమెరికాలోని న్యూయార్క్‌లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (J&J) కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు (ఫార్మాస్యూటికల్స్‌, ఆర్‌ అండ్‌ డీ) డాక్టర్‌ మథాయ్‌ మామెన్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణ జీవ ఔషధ రంగం అభివృద్ధికై మంత్రి తన ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్‌లో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో అవిష్కరణలను మరింత వేగవంతం చేసేందుకు జే అండ్‌ జే బృందం సూచనలను కోరారు.

కేటీఆర్‌ ప్రతిపాదనలకు స్పందించిన వివిధ పరిశ్రమలు

బోస్టన్‌ నగరంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరం ప్రపంచ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌ గా పేరు ఉన్నదని ఈ సందర్భంగా తెలిపారు.  లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలైన ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టిందని, అందులో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు, పాలసీ పరమైన నిర్ణయాలు, ఇన్నోవేషన్‌ కి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫండ్‌ ను ఏర్పాటు చేయడం, జీనోమ్‌ వ్యాలీ లో ప్రత్యేకంగా ఒక ఇంక్యుబేటర్‌ ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలను తీసుకున్నదని, వీటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ బయో లైఫ్‌ సైన్సెస్‌ ఫార్మా ఉత్పత్తులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. కేటీఆర్‌ ప్రసంగం తరువాత పలు కంపెనీలు తమ వ్యాపార విస్తరణను తెలంగాణ కేంద్రంగా చేసుకుని విస్తరిస్తున్నట్లు ప్రకటించాయి.

 

Tags :