Radha Spaces ASBL

ఘనంగా ముగిసిన ఆటా వేడుకలు

ఘనంగా ముగిసిన ఆటా వేడుకలు

కృష్ణంరాజుకు జీవితసాఫల్య పురస్కారం

అమెరికాలో స్థిరపడి పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. ఈ నెల 11న ప్రారంభమైన ఆటా వేడుకలు ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన వేడుకలతో ముగిశాయి. ఈ?కార్యక్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, రసమయి బాలకిషన్‌ పాల్గొన్నారు. ఆటా అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ భువనేష్‌ బూజాలతోపాటు పలువురు ఆటా నాయకులు ఈ?వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు.

ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. లక్ష మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ భారతీయ సాంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎప్పుడో నిర్మించిన పాఠశాలల పునరుద్దరణకోసం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు భారత సమాజాన్ని చూసి అక్కడి సమాజం సంస్కృతి సంప్రదాయాలను నేర్చుకుందని, కానీ ప్రస్తుత మన సమాజం సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోయిందన్నారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ భారతదేశానికి వచ్చి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించి ఇక్కడ ఉన్న వారికి స్ఫూర్తినిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజుకు జీవత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. నీరజ్‌ సంపతి (వ్యాపారం, క్రీడలు), శ్రీ కళాకృష్ణ, కొమండూరి రామాచారి (సంగీతం), సాదామిని ప్రొద్దుటూరి (మహిళా సాథికారత), కృష్ణమనేని పాపారావు (సామాజిక సేవా) రంగాల వారికి పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాయకుడు రామాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆటా జీవనసాఫల్య పురస్కారాన్ని అందుకున్న నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ, తనకు ఈ అవార్డు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, విదేశాల్లో తెలుగు సంస్కృతి, భాష వ్యాప్తికి తనవంతు కృషి చేస్తానని హామి ఇచ్చారు. తానా ప్రారంభించిన తొలిరోజుల్లో తాను తన సొంత ఖర్చులతో వివిధ రంగాలకు చెందినవారిని అమెరికాకు పంపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆటా మాతృరాష్ట్రంలో చేసిన వేడుకలను, సేవలను ఆయన అభినందించారు.

Click here for Event Gallery

 

Tags :