ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అవినీతి లేని పాలన నా లక్ష్యం- జగన్‌

అవినీతి లేని పాలన నా లక్ష్యం- జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ను అన్నీరంగాల్లో అభివృద్ధిచేసి, అవినీతికి దూరంగా, అభివృద్ధికి దగ్గరగా ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్‌సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఎన్నారైలను ఉద్దేశించి జగన్‌ ప్రసంగించారు. పారిశ్రామిక అభివద్ధికి మా ప్రభుత్వం  రెడ్‌ కార్పెట్‌ వేస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రండి. మీకు అండగా మేముంటాం' అని కూడా ఆయన పేర్కొన్నారు.

తొలుత వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జగన్‌ ఎన్నారైలను ఉద్దేశించి మాట్లాడారు. వైకాపా విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. ''ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌ అన్న మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ స్ఫూర్తిదాయకం. అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రాన్ని చూడాలని నా కల. అన్నం పెడుతున్న రైతు ఆకలిబాధతో మరణించకూడదన్నది నా కల. ఏ ప్రభుత్వ పథకమైనా లంచం, వివక్ష లేకుండా పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాలన్నది నా కల. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి కాల్వల ద్వారా నీరు అందించాలన్నది నా కల. పాలకులు మనసు పెడితే చేయలేనిది ఏదీ లేదు.  రెండున్నర నెలల పరిపాలనలోనే చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి కార్యక్రమాలు చేపట్టాం. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను కూడా ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, మద్యం బెల్టు దుకాణాల మూసివేత చేపట్టాం. మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం రిజర్వేషన్‌ కల్పించాం. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేశాం''.

''అవినీతికి ఆస్కారం లేకుండా టెండర్ల విషయంలో న్యాయ సమీక్ష చేపట్టాలని నిర్ణయించాం. దేశంలో కనీవినీ ఎరుగని విధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానం తీసుకొస్తున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తున్నాం. పాఠశాలలు, ఆసుపత్రుల ప్రస్తుత ఫొటోలు చూపిస్తున్నాం. తర్వాత నాడు, నేడు అంటూ అభివద్ధి చేసిన పాఠశాలలు, ఆసుపత్రుల ఫొటోలు చూపిస్తాం.  గత ప్రభుత్వం అవకాశం ఉన్నా తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయలేదు. 13 నెలలుగా డిస్కమ్‌లకు బిల్లులు కూడా చెల్లించలేదు. దాదాపు రూ.20వేల కోట్లు డిస్కమ్‌లకు బకాయిలు పడింది. రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు ఉన్నాయి. పల్లెలు, పట్టణాల మధ్య అంతరాలను చెరిపేసే చర్యలు చేపట్టాం.

కనీసం ఏడాదికి ఒకటి.. రెండు సార్లయినా ప్రవాసాంధ్రులను ఏపీకి రావాలని ఆహ్వానిస్తున్నా. ప్రభుత్వం, ప్రవాసాంధ్రులు కలిసి గ్రామాలను బాగుచేసుకుందాం. ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ఒక పోర్టల్‌  తెరవబోతున్నాం. పోర్టల్‌ నేరుగా సీఎం కార్యాలయానికి అనుసంధానమై ఉంటుంది. మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే పోర్టల్‌లో చెప్పొచ్చు. పోర్టల్‌ పర్యవేక్షణకు ఒక అధికారిని నియమిస్తాం'' అని జగన్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు భారీగా తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో సౌత్‌లేక్‌ మేయర్‌ లారా హిల్‌, తెలుగు కమ్యూనిటీ ప్రముఖులు, నాటాఅడ్వయిజర్‌ డా.ప్రేమ్‌సాగర్‌రెడ్డి, డా.లకిరెడ్డి హనిమిరెడ్డి, ఆత్మచరణ్‌రెడ్డి, నాటా అధ్యక్షుడు రాఘవరెడ్డి గోసల కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, కడప రత్నాకర్‌, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గుడివాడ అమరనాధ్‌, మాగుంట శ్రీనివాసులరెడ్డి, యార్లగడ్డ శివరాం, తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి, ఆటా అధ్యక్షుడు పరమేశ్‌ భీమ్‌రెడ్డి, టాటా నుండి పైళ్ల మల్లారెడ్డి, డాటా నుండి పోలీస్‌ చంద్రారెడ్డి, టీడిఎఫ్‌ నుండి కలవాల అజయ్‌, విశ్వేశ్వర్‌ కలవాల,నాట్స్‌ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్‌, సిలికానాంధ్ర నుండి కూచిభొట్ల ఆనంద్‌, దీనబాబు కొండుభట్ల, తదితరులు పాల్గొన్నారు.

Click here for Event Gallery

Tags :