రామానుజుల క్షేత్రం అద్భుతం...వైఎస్ జగన్
హైదరాబాద్లోని ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహం అద్భుతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 7వ తేదీన జరిగిన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్ కూడా పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనారాయణ హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రామానుజుల విరాట్మూర్తిని, దివ్యదేశాలను సందర్శించుకున్నారు. దివ్యక్షేత్రం అద్భుతంగా రూపుదిద్దుకుందని, పట్టుదలతో గొప్ప క్షేత్రాన్ని రూపొందించారని చినజీయర్ స్వామిని కొనియాడారు. ఏపీ దేవాదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో కలిసి వైఎస్ జగన్ సమతామూర్తి కేంద్రానికి వచ్చారు.
అమెరికాకు చెందిన ప్రవాస భారతీయ చిన్నారులు ప్రవచనశాలలో నిర్వహించిన విష్ణు సహస్రనామ అవధానాన్ని సీఎం వైఎస్ జగన్, మిగతావారు ఆసక్తిగా తిలకించారు. ఆ చిన్నారులు విష్ణు సహస్రనామాల్లోని ఏదైనా శ్లోకం మొదటి పాదం చెప్పగానే ఆ శ్లోకం సంఖ్య చెప్పడం.. ఏదైనా శ్లోకం సంఖ్య చెప్పగానే సదరు శ్లోకం మొదటి పాదాన్ని అప్పజెప్పడం.. శ్లోకాల్లోని ఏదో ఓ పేరు చెప్పగానే ఆ పేరు సహస్రనామాల్లో ఎన్ని పర్యాయాలు వినిపిస్తుందో, ఏ శ్లోకం ఎన్నో పాదంలో ఉంటుందో చెప్పడం వంటి అద్భుత ప్రతిభను కనబరిచారు. వారందరినీ వైఎస్ జగన్ అభినందించారు. అమెరికాలో ఉంటూ కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో పెరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు అందించిన ఆధ్యాత్మిక పుస్తకాలను స్వీకరించారు. అదే వేదిక మీద శ్రీరామానుజుల గొప్పదనం, వెయ్యేళ్ల కిందే సమతాస్ఫూర్తి కోసం ఆయన పాటుపడిన తీరును జగన్ కొనియాడారు. గొప్ప క్షేత్రాన్ని నిర్మించారని చినజీయర్ స్వామిని ప్రశంసించారు.
ప్రవచనశాలలో కార్యక్రమం ముగిశాక.. చినజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు కలిసి వైఎస్ జగన్ బృందాన్ని ప్రధాన క్షేత్రంలోకి తోడ్కొని వెళ్లారు. 108 దివ్యదేశాలను చూపించారు. ప్రత్యేక హెడ్సెట్ ద్వారా వాటి ప్రత్యేకతలను జగన్ విన్నారు. తర్వాత విరాట్మూర్తి దిగువన ఉన్న సువర్ణ మూర్తిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి భారీ విరాట్మూర్తి వద్దకు చేరుకుని పరిశీలించారు. రామానుజుల మూర్తి అద్భుతంగా రూపొందిందని, మోములో ప్రశాంత చిత్తం ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. రామానుజుల జీవితచరిత్రను తెలిపే అగుమెంటెడ్ రియాలిటీ షోను తిలకించారు.
గోత్రనామాలతో వేదాశీర్వచనం
తిరిగి యాగశాలకు చేరుకున్న జగన్మోహన్రెడ్డి తదితరులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రుత్వికులు జగన్మోహన్రెడ్డి, వారి మాతృమూర్తి విజయమ్మ, ధర్మపత్ని భారతీరెడ్డి, పిల్లల పేర్లను గోత్రనామాలు, నక్షత్రాలతో సంకల్పం చెప్పించారు. ప్రత్యేకంగా వేసిన పీటపై వైఎస్ జగన్ను కూర్చోబెట్టి.. యజ్ఞ కంకణం, లక్ష్మీనారాయణ హోమ కడియం ధరింపచేసి.. విశ్వక్సేన ఆరాధన చేయించారు. యాగద్రవ్యాలను తాకించి పూర్ణాహుతి పూర్తి చేశారు. తర్వాత తీర్థప్రసాదాలు అందించారు.