Radha Spaces ASBL

50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందే: చంద్రబాబు

50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందే: చంద్రబాబు

ఢిల్లీ: ఈవీఎంలలో 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. బీజేపీ దిశానిర్దేశంలో కాకుండా.. ఈసీ స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌లో ప్రతిపక్షాల సమావేశం ముగిసిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. తనకు టెక్నాలజీ తెలుసని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నది తమ తాపత్రయం అన్నారు. ఏపీలో వేలాది మెషీన్లు మొరాయించాయని.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేయలేదన్నారు. అంతలో శాంతిభద్రతల సమస్య సృష్టించారని.. అయినా ముందుకు వచ్చి ఓట్లు వేశారని తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడారని పేర్కొన్నారు. 50శాతం వీవీ ప్యాట్ లు లెక్కించాల్సిందేనని.. లేనిపక్షంలో సుప్రీం కోర్టుకు వెళతామన్నారు. ప్రజల్లోకి వెళ్లి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.

తెలంగాణలో సాంకేతికతను దుర్వినియోగం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆ రాష్ట్రంలో 25 లక్షల మంది ఓట్లను తొలగించారని.. ఆ తర్వాత అధికారులు క్షమాపణ చెప్పారన్నారు. పోలైన వాటి కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని.. ఇదెలా సాధ్యమైందో అర్ధం కావడం లేదన్నారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికే ఓటు వేయడానికి ఇబ్బందికి గురయ్యారన్నారు. చివరి ఓటు తెల్లవారుజామున 4 గంటలకు పడిందని.. ఎన్నికల నిర్వహణ తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులు 7 సెక్లనకు బదులు 3 సెకన్లే ఉన్నాయని.. ఇది ఎలా మారిపోయిందని ప్రశ్నిస్తే.. ఈసీ దగ్గర సమాధానం లేదని మండిపడ్డారు. చాలా దేశాలు ఈవీఎంలు పక్కనపెట్టి బ్యాలెట్‌కు వచ్చాయని.. జర్మనీ లాంటి దేశాలు కూడా బ్యాలెట్‌కు వచ్చాయని పేర్కొన్నారు. ఈవీఎం వల్ల ఫలితాలను తారుమారు చేసే అవకాశముందని వాపోయారు. మన దేశంలో ఈవీఎంల ఆడిట్‌కు అవకాశం లేదని.. సీఈసీకి ఈ పదవి కొత్త కావచ్చు కానీ... తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల కౌంటింగ్ విషయంలో సుప్రీంకోర్టుకు సీఈసీ అబద్ధాలు చెప్పిందని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోతోందని విమర్శించారు. తమ అధికారులను బదిలీ చేశారని.. దర్యాప్తు సంస్థలతో తమపై దాడులు చేయిస్తున్నారని వాపోయారు.

Tags :