Radha Spaces ASBL

ఆటా వేడుకలు 2019 - అమెరికా నుంచి తరలివచ్చిన నాయకులు... ప్రముఖులు

ఆటా వేడుకలు 2019 - అమెరికా నుంచి తరలివచ్చిన నాయకులు... ప్రముఖులు

ప్రతి రెండేళ్ళకోమారు మాతృరాష్ట్రాల్లో ఆటా వేడుకలను అమెరికా తెలుగు సంఘం భారీ ఎత్తున నిర్వహించడం పరిపాటి. 2019లో కూడా ఆటా వేడుకలను వివిధ చోట్ల పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. అమెరికాలోనే కాకుండా మాతృరాష్ట్రాల్లో ఉన్న తెలుగువారిని కూడా ఆదుకోవడం తమ కర్తవ్యమని అందుకోసమే ఆటా ప్రత్యేకంగా డిసెంబర్‌ నెలలో ఆటా వేడుకలు పేరుతో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెబుతున్నారు. మాతృరాష్ట్రాల్లో నిర్వహించే ఆటా వేడుకల్లో భాగంగా 5 కె రన్‌, ఆరోగ్యశిబిరాలు, సెమినార్స్‌, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. దీంతోపాటు విద్యార్థులకు అమెరికా విద్యపై అవగాహన కల్పించేందుకు వీలుగా విద్యా సదస్సులను కూడా నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని పారిశ్రామికవేత్తలకోసం బిజినెస్‌ సెమినార్‌లను కూడా ఏర్పాటు చేశారు.

ఆటా అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డి నాయకత్వంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆటా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ భువనేశ్‌ బూజాల ఈ వేడుకలకు చైర్‌గా వ్యవహరిస్తున్నారు. జయంత్‌ చల్లా కో చైర్‌గా ఉన్నారు. ఈ ఆటా వేడుకల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆటా నాయకులు పలువురు అమెరికా నుంచి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు వస్తున్నారు. దాదాపు 10 నుంచి 15 మంది సీనియర్‌ నాయకులు వస్తున్నట్లు సమాచారం. వీరితోపాటు మరికొంతమంది ఆటా సభ్యులు కూడా వస్తున్నారని ఆటా నాయకులు తెలిపారు. ఈ వేడుకలకోసం ఆటా దాదాపు 1 కోటి రూపాయలను ఖర్చు చేస్తోంది. ప్రెసిడెంట్‌ పరమేష్‌ భీంరెడ్డితోపాటు భువనేష్‌ బూజాల, మాజీ అధ్యక్షుడు కరుణాకర్‌ అసిరెడ్డి, కార్యదర్శి వేణు సంకినేని, ట్రస్టీలు రామకృష్ణా రెడ్డి, అనిల్‌ బోదిరెడ్డి, జయంత్‌చల్లా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ పాశం, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌  నరసింహారెడ్డి, కాన్ఫరెన్స్‌ కోఆర్డినేటర్‌ రిందా రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.

ఆటా వేడుకల వివరాలు

10వ తేదీన ఆటా నాయకుల ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. అదేరోజు నిర్మల్‌ దగ్గర ఉన్న దిల్‌వార్‌పూర్‌ గ్రామంలో స్కూల్‌ ప్రాజెక్ట్‌, హెల్త్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. మధు బొమ్మినేని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేశారు. 11వ తేదీన ఆదిలాబాద్‌ జిల్లాలోని జామ్‌ విలేజ్‌లో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. అజయ్‌ రెడ్డి దీనిని స్పాన్సర్‌ చేశారు. 13వ తేదీన సూర్యాపేట్‌ జిల్లాలోని మామిళ్ళగూడెం గ్రామంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, జాబ్‌ మేళా కార్యక్రమం జరుగుతుంది. శ్రీనివాస్‌ రనబోతు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేశారు.

14వ తేదీన ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సును ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 15వ తేదీన ఆటా సాంస్కృతిక, జానపద ఉత్సవాల కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహిస్తున్నారు. 16వ తేదీన రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో స్కూల్‌ ప్రాజెక్టు, స్టూడెంట్‌ స్కాలర్‌ షిప్‌ కార్యక్రమాన్ని జయంత్‌ చల్లా ఏర్పాటు చేశారు. 18వ తేదీన వైజాగ్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఆటా బిజినెస్‌ కాన్ఫరెన్స్‌ జరుగుతుంది. 20వ తేదీన హైదరాబాద్‌లోని టీ హబ్‌లో మరో బిజినెస్‌ కాన్ఫరెన్స్‌ను వటా టీమ్‌ ఏర్పాటు చేసింది.

జోగుళాంబ గద్వాల జిల్లాలోని చిన్న అమిదలపాడు గ్రామంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, జాబ్‌ మేళాను నిర్వ హిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రామకృష్ణ ఆల స్పాన్సర్‌ చేశారు. 23వ తేదీన హైదరాబాద్‌లోని మేరిగోల్డ్‌ హోటల్‌లో ఎడ్యుకేషనల్‌ సెమినార్‌ నిర్వహిస్తున్నారు. 24వ తేదీన రంగారెడ్డి జిల్లా కడిత్తాల్‌ విలేజ్‌, కల్వకుర్తిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, జాబ్‌ మేళా, వందేమాతరం ఫౌండేషన్‌ కార్య క్రమాలను నిర్వహిస్తున్నారు. కిషోర్‌ రెడ్డి గూడూరు కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేశారు.

26వ తేదీన వరంగల్‌ జిల్లా నర్సంపేట్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, జాబ్‌మేళా కార్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. అనిల్‌ బోదిరెడ్డి దీనిని స్పాన్సర్‌ చేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 27వ తేదీన స్కూల్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌, ఆటా సాంస్కృతిక ఉత్సవాలను ఏర్పాటు చేశారు. పోతిరెడ్డిపల్లి, జడ్చర్లలో ఈ కార్యక్రమం జరుగుతోంది. పరమేష్‌ భీంరెడ్డి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేశారు. 29వ తేదీన గ్రాండ్‌ ఫైనల్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేశారు.

 

Tags :