ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సుకు మంచి స్పందన

ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సుకు మంచి స్పందన

అమెరికా తెలుగు సంఘం 'ఆటా' ఆధ్వర్యంలో డిసెంబర్‌ 14వ తేదీన జరిగిన అంతర్జాతీయ సాహితీ సదస్సు హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ముందు తరాలతో సంభాషణ, నవకవి సమ్మేళనం, పన్నెండుగురు కొత్తతరం కవుల కవితాగానం, ఇప్పటి కథకులు ఆలోచన, అనుభవాలు, పద్యం పాటా, జానపదం కార్యక్రమాలను నిర్విహించారు. ఈ సందర్భంగా ఒక్క వేదికపై అలనాటి కవులు, నేటి తరం కవులతో కలిసి 39 మంది కవులు అంతర్జాతీయ సాహితీ సదస్సులో పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో సుప్రసిద్ద వచన కవులు కె.శివారెడ్డి, నందిని సిధారెడ్డి, రాచపాళెం, కె.శ్రీనివాస్‌, ఓల్గా, అఫ్సర్‌, కసిరెడ్డి వెంకట రెడ్డిలతో ఇప్పటి కథకుల ఆలోచనలు, అనుభవాలు కార్యక్రమంలో కె.ఎన్‌.మల్లీశ్వరి, వెల్దండి శ్రీధర్‌, పూడూరి రాజిరెడ్డి, వెంకట సిద్ధారెడ్డి, మల్లికార్జున్‌, పూర్ణిమ తమ్మిరెడ్డి, స్వాతి కుమారి బండ్లమూడి పాల్గొన్నారు. పన్నెండు మంది కొత్త తరం కవులతో కవి సమ్మేళనం జరిగాయి. నేపద్య గేయ రచయితలు దేశపతి శ్రీనివాస్‌, అనంత శ్రీరామ్‌, ప్రొద్దుటూరి యెల్లారెడ్డి పాల్గొనే 'పద్యం, పాట, జానపదం' కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆటా ప్రెసిడెంట్‌ పరమేశ్‌ భీం రెడ్డి, తదుపరి ప్రెసిడెంట్‌ భువనేశ్‌ బుజాలా, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ అనిల్‌ బోదిరెడ్డి, రామకష్ణ రెడ్డి అలా, ఆటా 2020 కన్వెన్షన్‌ కన్వీనర్‌ నర్సింహా రెడ్డి ద్యాసాని పలువురు ఆటా ప్రతినిధులతో పాటు 20 మంది అమెరికా నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.

 

ఆటా ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ భువనేశ్‌ బుజాలా మాట్లాడుతూ, తెలుగు ప్రజలకు అమెరికాలో ఉన్న ఆటా వారధిగా ఉంటుందని ఆటా అక్షరాల బాట అంటూ నవతరం కవులు యువతరం కవులకు మధ్య అనుసంధానం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. పాత కొత్త కవులతో అనుసంధాన సమావేశం సాహిత్యలోకానికి చేయుతనివ్వడానికి ఆటా ఎప్పుడు ముందు ఉంటుందని... సాహిత్యరంగంలో మరింతమంది రాణించే విదంగా చేయూతనివ్వ డానికి భవిష్యత్‌ లో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని భువనేశ్‌ తెలిపారు. కేవలం సాహిత్యమే కాకుండా ఇతర రంగాల్లో కూడా అభివద్ధికి ఆటా అండగా ఉంటుందని చెప్పారు. 

సుప్రసిద్ద వచన కవి శివారెడ్డి మాట్లాడుతూ, కొత్త తరాల మీద మనకు కొన్ని అపోహలు అపనమ్మకాలు ఉన్నాయి.. ఇతరులతో మనం నమ్మకం ఉంచినప్పుడు ఆదే నమ్మకంతో కొనసాగాలని అన్నారు. మా తరం ఒక నమ్మకంతో బయలుదేరింది.. నేర్చుకోవడం అనేది ఓ జీవిత కాలం ప్రయాణమని ఆయన అనుభవాలను పంచుకున్నారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడాలంటే మీకు మీరే ఓ రోల్‌ మోడెల్‌ గా ఉండాలని.. ప్రతి రచయిత ప్రతి కవి కూడా మోడల్‌ ను సష్టించాలని సూచించారు. ప్రతి తరం ఆ ముందు తరం నుంచి చాలా నేర్చుకోవాలి. కుటుంబ సామాజిక వ్యవస్థలో ఒక ఐడియల్‌ క్యారెక్టర్‌ ను సష్టించగలగాలి. దూరంగా ఉంటే రచనలు ద్వారా దగ్గర ఉంటే వ్యక్తిత్వం ద్వారా నేర్చుకుంటారు. ఇలాంటి అనుసంధాన కార్యక్రమాలు ఆటా చేయడం చాలా సంతోషంగా ఉందని శివారెడ్డి తెలిపారు. అందరిని ఒకే దగ్గరికి చేర్చి ఒకరి నుండి మరొకరికి స్ఫూర్తినివ్వడానికి ఈ కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని తెలిపారు.

ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, నలుగురితో చర్చలు జరిగితే ఆలోచనలు వికసిస్తాయి.. ఈ ఆలోచనలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిదద్దుతాయని వ్యాసకర్త, జానపద వాజ్మయ పరిశోధకుడు కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎవరి ఆచరణలు అనుసరించే విదంగా ఉంటాయో వాళ్ళ మార్గాలను మనం అనుసరిస్తామని ఆయన తెలిపారు. ఎవరి ఆనుభవాల మాటమూటగా వస్తే అదే మనం విప్పుతామని అందులో సుగుణాలను మనం నేర్చుకుంటామని తెలిపారు.

ఆటా అధ్యక్షుడు పరమేశ్‌ భీంరెడ్డి మాట్లాడుతూ, ఆటా తెలుగు సాహిత్య కార్యక్రమాలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, ఆటా వేడుకలు కార్యక్రమాల్లో సాహిత్యకార్యక్రమం కూడా పెద్దఎత్తున నిర్వహించాలని అనుకున్నామని, ఈ కార్యక్రమం విజయవంతానికి అందరూ సహకరించారని, వారందరికీ ధన్యవాదాలని చెప్పారు. చివరగా కార్యక్రమాల్లో పాల్గొన్నవారందరికీ మెమోంటోలను అందజేశారు.

Click here for Event Gallery

 

Tags :